దావోస్‌లో ప‌క్క‌రాష్ట్ర సీఎం ఈగ‌లు తోలుకుంటున్నారు!: పువ్వాడ

“ప్ర‌పంచ ఆర్థిక ఫోరం జ‌రుగుతున్న దావోస్‌లో మంత్రి కేటీఆర్ అడుగు పెట్టగానే రాష్ట్రంలో పెట్టుబడులకు అంతర్జాతీయ సంస్థలు ఎగబడుతుంటే.. పక్క రాష్ట్రాల సీఎంలు ఈగ‌లు తోలుకుంటున్నారు..” అని తెలంగాణ‌ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ఎద్దేవా చేశారు. ఖమ్మం ఎన్ఎస్పీ క్యాంపులో రూ. కోటి 10 లక్షలతో నిర్మించిన గిరిజన భవనాన్ని మంత్రి సత్యవతి రాఠోడ్, ఎంపీ నామాతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం.. రఘునాథపాలెం మండలంలో “స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌” గురుకుల పాఠశాల నూతన భవన నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.

గతంలో పనిచేసిన పాలకులు.. గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. టీఆర్ఎస్‌ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే.. అది చూడకుండా పల్లెలను విస్మరించారని విమర్శిస్తున్నారు. పీసీసీ పదవి వచ్చినంత మాత్రాన సీఎం కేసీఆర్ను విమర్శిస్తే పెద్ద నాయకుడు అవుతారనుకోవడం పొరపాటు. తెలంగాణ వస్తే చీకటి ఏర్పడుతుందన్న నాయకుల రాష్ట్రాలు ఇప్పుడు కరెంటు కోతలతో అల్లాడుతున్నాయి. దావోస్ సదస్సులో మంత్రి కేటీఆర్ అడుగుపెట్టగానే రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకు ఒక్క ప్రాజెక్టు కూడా లేదు అని పువ్వాడ వ్యాఖ్యానించారు.

‘తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన జాతీయ పార్టీ ఎంపీలు.. కనీసం రాష్ట్ర అభివృద్ధి కోసం సభలో ప్రస్తావించడం లేదు. పార్లమెంటులో ఏ రోజు కూడా రాష్ట్ర ప్రజలు, సమస్యలు, రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి ఏనాడు గొంతెత్తలేదు. కానీ ఇక్కడ మాత్రం మాయమాటలతో ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారు. తెలంగాణ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తున్నారు.’

రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించని వారంతా.. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని గ్రామాల బాటపడుతున్నారని విమర్శించారు. అభివృద్ధికి అడ్డుపడుతున్న వారందరికీ ప్రజలు బుద్ధిచెప్పాల్సిన అవసరమందని పేర్కొన్నారు. ఏదేమైనా.. మంత్రి పువ్వాడ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి.