కేంద్రంపై పోరుకు కేసీఆర్ చేతికి సుప్రీం ‘అస్త్రం’!


కొంతమంది రాజకీయ అధినేతలకు కాలం ఎప్పుడూ కలిసి వస్తూనే ఉంటుంది. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలాంటిది మరికాస్త ఎక్కవనే చెప్పాలి. గడిచిన కొంతకాలంగా కేంద్రంలోని మోడీ సర్కారు మీద అదే పనిగా విరుచుకుపడుతున్న కేసీఆర్ సర్కారు.. ఎప్పటికప్పుడు కొత్త అస్త్రాల్ని తన అమ్ముల పొదిలో సిద్ధం చేసుకుంటున్నారు.

రాష్ట్రాలు కట్టే పన్నులతో కేంద్రం పెత్తనం ఏమిటన్న ప్రశ్నతో పాటు.. పంచాయితీలకు నేరుగా నిధులు చెల్లించటం ఏమిటి? మధ్యలో మేమేం అయిపోయాం? అంటూ రాష్ట్ర ప్రభుత్వాల ఆస్తిత్వాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రం తీరును క్వశ్చన్ చేయటం తెలిసిందే.


మరి.. ఇన్నేళ్లుగా గుర్తుకు రాని ఇలాంటివి ఇప్పుడే గులాబీ బాస్ కు ఎందుకు గుర్తుకు వస్తున్నాయంటే.. అదే కేసీఆర్ గొప్పతనం. ఏళ్లకు ఏళ్లుగా సాగుతున్న విధానాల్ని.. తనకు అవసరమైన సమయంలో తనకు అనుకూలంగా మార్చుకోవటంలో ఆయనకు మించినోళ్లు కనిపించరు. ఇదిలా ఉంటే.. తాజాగా జీఎస్టీ వ్యవస్థ మొత్తాన్నిప్రభావితం చేసేలా సుప్రీంకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

జీఎస్టీ మండలి సిఫార్సులకు కట్టబడక్కర్లేదని.. పన్నులపై కేంద్ర.. రాష్ట్రాలకు సమాన అధికారం ఉందన్న మాటలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కచ్ఛితంగా బలాన్నిచేకూర్చటమే కాదు.. ఆయన వాదనకు సరికొత్త అస్త్రాలు చేతికి అందినట్లేనన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ జీఎస్టీ మండలి అధికారాలపై సుప్రీంకోర్టు చేసిన సంచలన వ్యాఖ్యల్ని చూస్తే..

  • జీఎస్టీ మండలి సిఫార్సులు శిలాశాసనం కాదు. వాటికి కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు.
  • పన్నులు విధించే విషయంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన అధికారాలు ఉన్నాయి. ఇందులో ఎవరూ ఎక్కువ.. తక్కువ కాదు. జీఎస్టీ మండలిలో సంప్రదింపుల ద్వారా ఏకాభిప్రాయానికి రావాలి.
  • జీఎస్టీ మండలి సిఫార్సులకు అనుగుణంగా ప్రభుత్వాలు చేసే చట్టాలు.. నిబందనల్ని సమీక్షించే అధికారం రాజ్యాంగ బద్ధంగా సుప్రీంకోర్టుకు ఉంది.
  • జీఎస్టీ మండలి సిఫార్సుల్ని అడ్డం పెట్టుకొని.. వాటిని అమలు చేస్తున్నామనే నెపంతోచట్ట విరుద్ధంగా సముద్రతల దిగుమతులపై ఐజీఎస్టీని వసూలు చేయటాన్ని సమర్థించుకునే కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి.. తప్పు పట్టింది.
  • జీఎస్టీ మండలి కేవలం పరోక్ష పన్నుల వ్యవస్థను పర్యవేక్షించే రాజ్యాంగ బద్ధ సంస్థ మాత్రమే కాదు..ప్రజాస్వామ్యాన్ని.. సమాఖ్య తత్వాన్ని బలోపేతం చేసే వేదిక.
  • కేంద్రం నిర్ణయంతో ఏకీభవించని పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్రాలు వివిధ రూపాల్లో తమ వాదనను వినిపించుకోవచ్చు. సముద్ర మార్గంలో విదేశాల నుంచి వచ్చే వస్తువులపై కేంద్రం ఐదు శాతం ఐజీఎస్టీ విధించటాన్ని తప్పు పడుతూ గుజరాత్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సరైనదేనంటూ సమర్థించింది.
  • సముద్ర రవాణాపై ఇప్పటికే కేంద్రం అక్రమంగా వసూలు చేసిన ఐజీఎస్టీని వెనక్కి ఇవ్వాలని.. నోటీసులు అందుకున్న దిగుమతి దారులు ఆ పన్ను కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.