రెండేళ్ల ముందే ఏపీ రాజ‌కీయం వేడెక్కేసిందే…!

రాష్ట్రంలో రాజకీయాలు తీవ్ర‌స్థాయిలో వేడెక్కాయి. అటు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, ఇటు అధికార పార్టీ వైసీపీ కూడా.. తీవ్ర‌స్థాయిలో రాజకీయాలు చేస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే.. ఇప్పుడు.. రాష్ట్రం లో ఎన్నిక‌లు ఏమైనా జ‌రుగుతున్నాయా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. వాస్త‌వానికి అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగేందుకు ఇంకా రెండు సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్ప‌టి నుంచి ప్ర‌తిప‌క్ష టీడీపీ ప్ర‌జ ల్లో ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది.

గ‌తంలో వైసీపీ కూడా ప్ర‌తిపక్షంగా ఉన్న స‌మ‌యంలో ఇదే నిర్ణ‌యం తీసుకుని అడుగులు వేసింది. రెం డేళ్ల ముందు నుంచి వైసీపీ అధినేత‌గా జ‌గ‌న్ ప్ర‌జ‌ల మ‌ద్య ఉన్నారు. వారి స‌మ‌స్య‌లు విన్నారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను.. టీడీపీ కూడా తీసుకుంది. అయితే.. అప్ప‌ట్లో ప్ర‌జ‌ల్లోకి వెళ్లిన‌.. జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ ర‌థం ప‌ట్టారు. ఆ స‌మ‌యంలో అధికారంలో ఉన్న టీడీపీ మౌనంగా త‌న ప‌నితాను చేసుకుని పోయింది. ఇది ఆపార్టీకి న‌ష్టం చేకూర్చింది.

అంటే.. ప్ర‌తిప‌క్షంగా వైసీపీ అధినేత చేసిన‌..రాజకీయాలు ప్ర‌జ‌ల్లోకి వెళ్తున్నాయ‌ని.. గ్ర‌హించ‌లేక పోయింది టీడీపీ. కానీ, ఇప్పుడు టీడీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంటే.. ఆ త‌ర‌హా.. ప్ర‌చారం.. ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌ని.. గ్ర‌హించిన వైసీపీ ముందుగానే త‌ను కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌చ్చేసింది. అంటే.. టీడీపీ చేసే ప్ర‌చారానికి యాంటీ ప్ర‌చారం చేసి.. ప్ర‌జ‌లు టీడీపీవైపు మొగ్గ‌కుండా చూడాల‌నేది.. వైసీపీ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఈ కార‌ణం గానే గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు అయినా.. మంత్రుల బ‌స్సు యాత్ర‌లైనా.. క‌నిపిస్తున్నాయి.

దీంతో అటు టీడీపీ ప్ర‌జ‌ల్లోకి వెళ్తుండ‌డం.. ఇదే స‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తుండ‌డంతో రాష్ట్ర రాజ‌కీయాలు మ‌రింత వేడెక్కాయి. ప్ర‌జ‌ల వ‌ద్దకు వ‌చ్చే నేత‌లు.. వెళ్లే నేత‌ల‌తో రా ష్ట్ర రాజ‌కీయం వేడెక్కింది. అయితే.. ఈ నేప‌థ్యంలో ఒక‌రిపై ఒక‌రు నాయ‌కులు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం త‌ప్ప‌.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై దృష్టి పెట్టి ఉంటే.. బాగుండేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇప్ప‌టికైనా.. ఈ ప‌రిస్థితి మారుతుందేమో చూడాలి.