రాజీవ్ గాంధీ హంత‌కుడు విడుద‌ల‌.. సోనియా చ‌ల‌వ‌తోనే!

దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకులలో ప్రధాన దోషి పెరారి వాల‌న్ ను విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో 31 సంవత్సరాలుగా జీవిత ఖైదీ అనుభవిస్తున్న పెరారి వాలన్ త్వర లోనే విడుదల చేయనున్నారు. రాజీవ్ గాంధీ హత్యలో ప్రధాన కుట్రదారుడిగా పెరారివాల్‌ను అప్పట్లో సుప్రీం కోర్టు నిర్ధారించింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరుంబదూర్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్న ఘటనలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై విచారణ జరిపిన అధికారులు 1991 జూన్ 11న చెన్నైలో పెరారి వాల‌న్ ను అరెస్టు చేశారు. అప్పటికి ఆయన వయస్సు 19 సంవత్సరాలు. అనంతరం జరిగిన విచారణలో రాజీవ్ గాంధీ హత్య కుట్రకు ఈయనే కీలక సూత్రధారి అని పేర్కొంటూ.. ఏ7 గా కేసు నమోదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీం కోర్టు ఈ కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఏడుగురికి 2014లో యావజ్జీవ ఖైదు విధించింది. అయితే తమకు క్షమాభిక్ష పెట్టాలంటూ వీరంతా గవర్నర్ సహా రాష్ట్రపతికి పలుమార్లు విన్నవించారు. ఎట్టకేలకు తాజాగా పెరారి వాల‌న్ విడుదల చేయాలంటూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

సోనియా చ‌ల‌వ‌తోనే!

రాజీవ్‌గాంధీ హంత‌కులు సుదీర్ఘంగా జైళ్ల‌లో మ‌గ్గుతుండ‌డాన్ని ఆయ‌న‌కుటుంబ‌మే త‌ట్టుకోలేక పోయింది. ముఖ్యంగా రాజీవ్ స‌తీమ‌ణి, ప్ర‌స్తుత కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకు న్నారు. వారిని విడుద‌ల చేసేందుకు త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేదని.. పార్ల‌మెంటు సాక్షిగా 2016లోనే ఆమె చెప్పారు. అదేస‌మ‌యంలో రాజీవ్ కుమార్తె, కుమారుడు, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలు ఏకంగా.. త‌మిళ‌నాడులోని జైలుకు ప‌లుమార్లు వెళ్లి.. వీరిని ప‌రామ‌ర్శించ‌డం.. గ‌మ‌నార్హం. అప్పుడుకూడా త‌మ కుటుంబం వీరి విడుద‌ల‌ను కోరుకుంటోంద‌ని.. గ‌తం మ‌రిచిపోయి.. జ‌నజీవ‌నంలో ప్ర‌శాంతంగా గ‌డ‌పాల‌ని కోరుకుంటున్నామ‌ని.. చెప్పారు. ఏదేమైనా.. హంత‌కుడి విష‌యంలో అప్ప‌ట్లో గాంధీల కుటుంబం చూపిన సానుభూతికి ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్త‌మైంది.