అప్పుడు ఈ ద‌త్త‌పుత్రుడు ఎక్క‌డున్నాడు: సీఎం జ‌గ‌న్ ఫైర్‌

ప్రశ్నించాల్సిన సమయంలో చంద్రబాబును దత్తపుత్రుడు, ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5 ఎందుకు ప్రశ్నించలేదని సీఎం జగన్‌ మండిపడ్డారు. గత ప్రభుత్వం, మన ప్రభుత్వం మధ్య తేడాను ప్రజలు గమనించాలన్నారు. రైతు భరోసా పథకం గతంలో ఉండేదా?. మూడేళ్లలో అర కోటికిపైగా రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ.23,875 కోట్లు నేరుగా రైతన్నల ఖాతాల్లో జమ చేశామ‌ని తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఇంత సహాయపడిన ప్రభుత్వాన్ని ఏనాడైనా చూశారా? అని ప్ర‌శ్నించారు.

రైతన్నలకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉంటున్నామ‌న్నారు. ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా -పీఎం కిసాన్‌ తొలివిడత నిధులను ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి బ‌ట‌న్ నొక్కి రైతుల ఖాతాల్లో జ‌మ‌చేశారు. ఏలూరు జిల్లా గ‌ణ‌ప‌వ‌రంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌ముఖ్య‌మంత్రి వరసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ రైతు భరోసా కింద 50 ల‌క్ష‌ల 10 వేల 2 వంద‌ల 75 రైతు కుటుంబాలకు తొలి విడతగా 3 వేల 758 కోట్ల రూపాయ‌ల పెట్టుబడి సాయం అందించారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రం ఖరీఫ్‌ పనులు మొదలు కాక ముందే వైఎస్సార్‌ రైతు భరోసా నిధులు అందిస్తున్నామని అన్నారు. ప్ర‌జ‌లంద‌రి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి గణపవరంలో శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. నిర్దేశించిన‌ కేలండర్ ప్ర‌కారం క్రమం తప్పకుండా వైఎస్సార్‌ రైతు భరోసా ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఉచిత పంటల బీమా ద్వారా 31 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరిందన్నారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్ట చతుష్టయం ప్రశ్నించలేదని మండిప‌డ్డారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా? అని నిల‌దీశారు.

“ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోంది. కేంద్రం ప్రకటించని పంటలకు కూడా మద్దతు ధర కల్పించి కొనుగోలు చేస్తున్నాం. గతానికి, ఇప్పటికి ఉన్న తేడాను రైతులు గమనించాలి” అని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

మూడేళ్లలో రాష్ట్రంలో కరువు లేదని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 16 లక్షల టన్నులు పెరిగిందన్నారు. గత ప్రభుత్వంలో వడ్డీ లేని రుణాలకు ఐదేళ్లలో చెల్లించింది రూ.782 కోట్లు మాత్ర‌మేన‌న్న ఆయ‌న త‌మ‌ ప్రభుత్వం మూడేళ్లలో వడ్డీలేని రుణాలకు ఇచ్చింది రూ.1282 కోట్లుగా ఉంద‌న్నారు. రైతులకు మంచి చేయాలని మనసుతో ఆలోచించే ప్రభుత్వమిదని సీఎం జ‌గ‌న్ వెల్ల‌డించారు. ఏ పంట సీజన్‌లో జరిగిన నష్టానికి అదే సీజన్‌లో పరిహారం చెల్లిస్తున్నామ‌న్నారు.

“చంద్రబాబు దత్తపుత్రుడు పరామర్శకు బయల్దేరాడు. పరిహారం అందని ఒక్క రైతును కూడా చూపించలేకపోయాడు. ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమ చూపించాడు. నాడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు. రైతుకు ఉచిత విద్యుత్‌, వ్యవసాయం దండగ అన్న నాయకుడు చంద్రబాబు. రైతులపై కాల్పులు జరిపి చంపించిన నాయకుడు చంద్రబాబు. రుణాల పేరుతో మోసం చేసిన నాయుకుడి పాలనను గుర్తుచేసుకోవాలని” సీఎం జగన్‌ అన్నారు.