ఆ ధైర్యం చంద్ర‌బాబుకు, ఆయ‌న ద‌త్త‌పుత్రుడికి కూడా లేదు!.. జ‌గ‌న్

ఏపీ సీఎం.. జ‌గ‌న్ టీడీపీ అధినేత చంద్ర‌బాబు, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై విరుచుకుప‌డ్డారు. “టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో మంచి చేశామని చెప్పే ధైర్యం చంద్రబాబుకు లేదు. చంద్రబాబు ఇంత మంచి పని చేశాడని చెప్పే ధైర్యం దత్తపుత్రుడికి లేదు. దత్తపుత్రుడితో పాటు ఎల్లోమీడియాకు కూడా ధైర్యం లేదు” అని జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 2019లో మేనిఫెస్టోలో చెప్పిన 95 శాతం హామీలను తాము అమలు చేశామ‌ని జ‌గ‌న్‌ చెప్పారు.

నిజాయితీ, నిబద్ధతో ప్రజల ముందుకు వస్తున్నామ‌న్న సీఎం జ‌గ‌న్‌.. దుష్ట చతుష్టయం అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నలుగురికి తోడు వీరి దత్తపుత్రుడు కూడా తోడ‌య్యార‌ని నిప్పులు చెరిగారు. “మంచి చేస్తున్న ప్రభుత్వాన్ని వీరు జీర్ణించుకోలేరు. పరీక్షల పేపర్లు వీళ్లే లీక్‌ చేస్తారు. పేపర్‌ లీక్‌ను సమర్థించిన ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?. ఈఎస్‌ఐలో డబ్బులు కొట్టేసిన నాయకుడిని విచారించడానికి వీల్లేదనే ప్రతిపక్షం, ఎల్లోమీడియాను ఎక్కడైనా చూశారా” అని సీఎం జగన్‌ అన్నారు.

“కొడుక్కి పచ్చి అబద్ధాలు, మోసాలతో ట్రైనింగ్‌ ఇస్తున్న చంద్రబాబు లాంటి తండ్రిని ఎక్కడైనా చూశారా?. కోర్టుకు వెళ్లి మంచి పనులు అడ్డుకునే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా?. ప్రజలకు మంచి జరిగితే ఇలాంటి రాబందులకు అసలు నచ్చదు.” అని జ‌గ‌న్ వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక మ‌త్స్యకారుల‌కు ఇచ్చే డీజిల్‌పై సబ్సిడీ రూ.6 నుంచి రూ.9కి పెంచామ‌న్నారు. స్మార్ట్‌ కార్డులు జారీ చేసి డీజిల్‌ కొనేటప్పుడే సబ్సిడీ సొమ్ము మినహాయింపునిస్తున్నామ‌న్నారు. వేటకు వెళ్లి మత్స్యకారుడు ప్రమాదవశాత్తు చనిపోతే వచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచామ‌ని చెప్పారు. మత్స్యకారులకు అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామ‌ని సీఎం చెప్పారు.. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి పెట్టామ‌న్నారు.

కొత్తగా 9 ఫిషింగ్‌ హార్బర్లు, 4 ఫిషింగ్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా చర్యలు చేపడుతున్నామని సీఎం జగన్ వివ‌రించారు. మురమళ్లలో నిర్వహించిన మత్స్యకార భరోసా బహిరంగ సభలో జ‌గ‌న్ ఈ మేర‌కు ప్ర‌సంగించారు.