పవన్ నియోజకవర్గం – భీమ‌వ‌రం శీనుకు చుక్క‌లే చుక్కలు !

గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన భీమ‌వ‌రం శీను (పూర్తి పేరు గ్రంధి శ్రీ‌నివాస్) కు ఇప్పుడు చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి అన్న వార్త‌లు వ‌స్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పై గెలిచి అనూహ్య రీతిలో స‌క్సెస్ సాధించిన గ్రంధి శ్రీ‌నుకు ఇప్పుడు అధిష్టానం అపాయింట్మెంట్ ఇవ్వ‌డం లేదు అని విజువ‌ల్స్ తో స‌హా వెల్ల‌డ‌వుతోంది. ఇక్క‌డి రీజ‌న‌ల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి (ఎంపీ) కి క‌లిసి గోడు చెప్పుకున్నా ఫ‌లితం లేకుండా పోతోంద‌ని కూడా తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ అధిష్టానం పోక‌డ‌లు న‌చ్చ‌క భీమ‌వ‌రం ఎమ్మెల్యే వ‌ర్గీయులు ముభావంగానే ఉంటున్నారు. వాస్త‌వానికి ఆయ‌న గెలవ‌గానే బాగానే గుర్తింపు ఇచ్చారు. అదేవిధంగా ప‌వ‌న్ పై అప్ప‌ట్లో రాజ‌కీయ విమ‌ర్శ‌లు కూడా బాగానే చేయించారు. కానీ క‌హానీ ఎక్క‌డ చెడిందో కానీ ఆయ‌న‌కు ఇప్పుడు త‌గు ప్రాధాన్యం ద‌క్క‌డమే లేద‌ని తెలుస్తోంది.

ఒక‌ప్పుడు తిరుగులేని విధంగా నాయ‌క‌త్వ ప‌టిమ‌తో రాణించిన ఆయ‌న‌కు ఈ సారి టికెట్ ఇవ్వ‌డ‌మే క‌ష్టం అన్న భావ‌న‌తో వైసీపీ ఉంద‌న్న ప్ర‌చారం ఒక‌టి ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ఉంది. జ‌న‌సేన కూడా ఈ ఎమ్మెల్యేపై అనేక సార్లు త‌న గొంతుక బ‌లీయ‌మైన రీతిలోనే వినిపించింది.అయితే శ్రీ‌ను అనుచరులు త‌మ నేత‌ను మించి పోటుగాడు మ‌రొక‌రు లేరు అన్న రీతిలో మాట్లాడుతున్నార‌ని, ఇదెంత మాత్రం త‌గ‌ద‌ని జ‌గ‌న్ ఎమ్మెల్యే పై జ‌న‌సేన సెటైర్లు వేస్తోంది.

త‌మ అధినేత పై గెలిచార‌న్న ఆనంద‌మే త‌ప్ప ఆయ‌న కానీ ఆయ‌న వ‌ర్గీయులు కానీ ఈ ప్రాంతానికి చేసిందేమీ లేద‌ని, వీలున్నంత వ‌ర‌కూ త‌మ‌పై భౌతిక దాడులు చేయడ‌మే కాదు, పార్టీ కి మ‌రియు ప్ర‌భుత్వానికి చెడ్డ పేరు తేవ‌డం అన్న‌ది ఆయ‌న త‌రుచూ చేస్తున్న ప‌ని అని జ‌న‌సైనికులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.