వైకాపా భయపడిపోయిందా?

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయిపోయింది. ఇక గరిష్టంగా అధికారంలో కొనసాగేది రెండేళ్లే. ట్రెండ్ చూస్తుంటే జగన్ రెండేళ్ల పదవీ కాలం పూర్తయ్యే వరకు ప్రభుత్వాన్ని కొనసాగిస్తాడని అనిపించట్లేదు. అంతకంతకూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారి పోతుండటం.. ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుండటంతో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలకు వెళ్లడానికే ప్రయత్నిస్తాడనే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ముందస్తు ఎన్నికలు గ్యారెంటీ అని.. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఎలక్షన్స్ ఉంటాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ల మాదిరి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇళ్లకు పరిమితం అయితే కుదరదు. ఇక జనాల్లోకి వెళ్లాల్సిందే. ఈ దిశగా ‘గడప గడపకు వైకాపా’ పేరుతో ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అధికార పార్టీ. ఈ ప్రోగ్రాంలో భాగంగా వైకాపా నేతలు ఇంటింటికీ తిరగడానికి ప్రణాళిక రచించారు. ఐతే మూడేళ్లలో సంక్షేమ పథకాల కింద డబ్బులేయడం మినహాయిస్తే జగన్ సర్కారు పెద్దగా సాధించిందేమీ లేదు. అభివృద్ధి ఊసే లేదు. రోడ్లు దారుణాతి దారుణంగా తయారయ్యాయి.

అదే సమయంలో ధరల మోత మామూలుగా లేదు. ఈ నేపథ్యంలో జనాగ్రహం చవిచూడాల్సి వస్తుందేమో అని వైకాపా నాయకుల్లో ఆందోళన నెలకొంది. సొంత పార్టీ కార్యకర్తలే తీవ్ర అసంతృప్తితో ఉండటం, మెజారిటీ జనాల్లో ఆగ్రహం ఉండటంతో ఈ ప్రోగ్రాం ఎలాంటి ఫలితాన్నిస్తుందో అన్న సందేహాలు నెలకొన్నాయి. నెల్లూరు జిల్లాలో పార్టీ అంతర్గత సమావేశంలో వైకాపా నేతలు.. జనాల్లోకి ఎలా వెళ్లగలమని బహిరంగ వ్యాఖ్యలు చేయడం.. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు ఒక చోట జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం లాంటి పరిణామాలను వైకాపా అధినాయకత్వం గమనించినట్లే కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే పార్టీ పేరుతో అనుకున్న కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రోగ్రాంగా మార్చినట్లు తెలుస్తోంది. పైన పేర్కొన్న ‘గడప గడపకు వైకాపా’ పేరును.. ‘గడప గడపకు ప్రభుత్వం’ అని మార్చారు. పార్టీ పరంగా వెళ్తే ఇబ్బంది తప్పదని.. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వం మీద కొంత సానుకూలత ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా మార్చినట్లు తెలుస్తోంది. మరి ఈ మార్గంలో వెళ్లినా జనాల నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుందని చెప్పలేం.