అనంత వైసీపీలో అస‌మ్మ‌తి పోరు

ఏపీ అధికార పార్టీ వైసీపీలో అస‌మ్మ‌తి పోరు.. పెరిగిపోతోంది. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కుల మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. ఆధిప‌త్య పోరు.. ఒక‌రిపై ఒక‌రు పెత్త‌నం చేసుకోవ‌డం వంటి కార‌ణాల‌తో ప‌లు జిల్లాల్లో పార్టీ ప‌రిస్థితి అగ‌మ్య గోచ‌రంగా మారింది. మ‌రీముఖ్యంగా టీడీపీ బ‌లంగా ఉన్న జిల్లాల్లోను బీజేపీ పుంజుకుంటున్న జిల్లాల్లోనూ.. వైసీపీ నాయ‌కుల మ‌ధ్య స‌ఖ్య‌త లోపించ‌డం.. రాజ‌కీయంగా పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ ప‌రిణామాల‌పై అధిష్టానం సీరియ‌స్ అయిన‌ప్ప‌టికీ.. నాయ‌కులు ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు అనంత‌పురం జిల్లాను తీసుకుంటే.. ఇక్క‌డ టీడీపీ బ‌లంగా ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ సునామీ కార‌ణంగా.. ఇక్క‌డ వైసీపీ పుంజుకుని.. టీడీపీ ఓడిపోయినా అదే ఆ పార్టీకి శాశ్వ‌తం కాదు. ఇటు టీడీపీకి బ‌ల‌మైన నాయ‌కులు ఉన్నారు. మాజీ మంత్రులు ఉన్నారు. నియోజ‌క‌వ‌ర్గాల‌నే కాకుండా.. జిల్లాల‌ను సైతం శాశించే నేత‌లు ఉన్నారు. ఇక‌, బీజేపీ కూడా ఇక్క‌డ పుంజుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక్క‌డ త‌ర‌చుగా.. కార్య‌క్ర‌మాలు చేస్తోంది. అదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీ ఇక్క‌డ పుంజుకునేలా వ్యూహాలు అమ‌లు చేస్తోంది.

ఏడాదిలో రెండు మూడు సార్లు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు. అంటే మొత్తంగా.. అనంత‌పై టీడీపీ ప‌ట్టు ఉండ‌గా.. జ‌న‌సేన‌, బీజేపీలుకూడా ఇక్క‌డ ప‌ట్టుపెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు పుంజుకునేలా.. ప్ర‌య‌త్నాలు చేయ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వస్తున్నాయి. పైగా.. ఒక‌రిపై ఒక‌రు అధిప‌త్య రాజ‌కీయాలు చేసుకోవ‌డంతోపాటు.. మేం ఎందుకు గెల‌వం అనే దిశ‌గా వారు వ్యవ‌హ‌రిస్తున్నారు.

హిందూపురం ఎంపీకి ఆయ‌న పార్ల‌మెంటు ప‌రిధిలో మూడు, నాలుగు నియోక‌వ‌ర్గాల్లో ఎమ్మెల్యేల‌తో ప‌డ‌డం లేదు. పైగా కొద్ది రోజులుగా ఆయ‌న టీడీపీ ఎమ్మెల్యే ఉన్న హిందూపురం నియోజ‌క‌వ‌ర్గ పార్టీ కార్య‌క్ర‌మాల్లో వేలు పెట్ట‌డంతో అక్క‌డ నానా గొడ‌వ జ‌రిగింది. ఇక అనంత‌పురం ఎంపీ రంగ‌య్య‌కు తాజాగా మంత్రి అయిన ఉషా శ్రీచ‌ర‌ణ్‌తో ఎప్ప‌టి నుంచో గ్యాప్ ఉంది.

ఇక శంక‌ర్ నారాయ‌ణ మంత్రిగా ఉన్న‌ప్పుడు ఆయ‌న్ను జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలు ప‌ట్టించుకోలేదు. నానా ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు ఉషా శ్రీచ‌ర‌ణ్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. పుట్ట‌ప‌ర్తి, అనంత‌పురం అర్బ‌న్, క‌ళ్యాణ‌దుర్గం, శింగ‌న‌మ‌ల లాంటి చోట్ల గ్రూపు రాజ‌కీయాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. ఏదేమైనా గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ కంచుకోట‌ను ప‌గ‌ల‌గొట్టిన వైసీపీ ఆనందం ఎక్కువ రోజులు ఉండేలా లేదు.