కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు ?

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పుంజుకోవాలన్న తపన కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. అందుకనే ఇప్పటి నుండే కుటుంబంలో ఒక వ్యక్తికే టికెట్ అని, ఒక వ్యక్తికి ఒకటే పదవనే నియమాన్ని గట్టిగా పాటించాలని పార్టీలో అంతర్గత కమిటీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఒక రిపోర్టిచ్చింది. మామూలుగా అయితే కుటుంబంలో ఇద్దరు, ముగ్గురికి ఎన్నికల్లో టికెట్లిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

ఎన్నికల్లో తప్పక గెలుస్తారని, సమర్ధులని, పార్టీకి ఎంతో సేవ చేశారనే కారణాలతో కుటుంబాల్లో ఇన్నేసి టికెట్లు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఒకేవ్యక్తి రెండు మూడు పదవులను అనుభవించిన ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. అలాంటి వాళ్ళలో చాలమంది ఆకాశమే హద్దుగా అధికారాలను అనుభవించి కష్టకాలంలో ఉన్నపుడు పార్టీని వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. దాంతో సీనియర్ నేతలు వెళ్ళిపోయిన ప్రాంతాల్లో ఒక్కసారిగా నేతలు కరువయ్యారు.

బహుశా ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ పునరుజ్జీవనానికి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన రిపోర్టులో ఒక కుటుంబానికి ఒక టికెట్ అని, ఒక వ్యక్తికి ఒకటే పదవని రికమెండ్ చేసినట్లున్నారు. దానిపైనే అంతర్గత కమిటీ బాగా కసరత్తు చేసి దాన్నే అమలు చేయాలని సోనియాకు స్పష్టంగా రికమెండ్ చేసింది. ఇదే విషయాన్ని రాజస్థాన్ లో ఈనెల 13-15 మధ్య జరగబోయే చింతన్ సదస్సులో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు.

అలాగే పార్టీలోని ప్రతి కమిటీలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ, మహిళలకు 50 శాతం స్ధానాలను కచ్చితంగా కేటాయించాలని కూడా అంతర్గత కమిటీ సూచించింది. దీనివల్ల పార్టీకి దూరమవుతున్న వర్గాలు మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలున్నట్లు అంతర్గత కమిటీ చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాంటి వాటిని కచ్చితంగా పాటిస్తే జనాల్లో పార్టీపై నమ్మకం పెరుగుతుందని కమిటీ చెప్పింది.

ఇలాగే పార్టీ పదవులకు కచ్చితమైన కాలవ్యవధి పాటించాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. ఇపుడు సీనియర్లు ఎంతకాలం పడితే అంతకాలం పదవుల్లో కంటిన్యు అవుతున్నారు. దీనివల్ల ఇతర సీనియర్లకు, జూనియర్లకు పదవులు అందటం లేదనే అసంతృప్తిని కూడా కమిటీ ప్రస్తావించింది. చూడబోతే చింతన్ శిబిరంలో విప్లవాత్మక మార్పులే వచ్చేట్లున్నాయి.