ఏపీలో ముగ్గురు ఐఏఎస్ లకు జైలు శిక్ష..

ఒక కేసు విషయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు సాధారణ జైలుశిక్షతో పాటు.. జరిమానాను విధిస్తూ ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉదంతం సంచలనంగా మారింది. ఊహించని రీతిలో వచ్చిన ఈ తీర్పునకు వెంటనే అప్పీలుకు వెళ్లారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ద్విసభ్య ధర్మాసనం.. సింగిల్ జడ్జి తీర్పును ఆరు వారాల పాటు నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేయటంతో.. ముగ్గురు ఐఏఎస్ లు జైలుశిక్ష తీర్పు అమలుకు బ్రేకులు పడ్డాయి. దీంతో వారు ఊపిరి పీల్చుకునే పరిస్థితి.

ఇంతకూ ముగ్గురు ఐఏఎస్ లకు జైలుశిక్ష విధించేంత పెద్ద తప్పు ఏం చేశారు? ఇంతకీ ఆ ఐఏఎస్ లు ఎవరు. అన్న వివరాల్లోకి వెళితే.. ఏపీ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న పూనం మాలకొండయ్య.. వ్యవసాయ శాఖ పూర్వ కమిషనర్ హెచ్. అరుణ్ కుమార్.. పౌర సరఫరాల సంస్థ ఎండీ జి. వీరపాండియన్ లపై దాఖలైన పిటిషన్ లో ఏపీ హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపి.. నెల రోజులు జైలు.. రూ.2వేలు ఫైన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలు జారీ చేశారు.

అసలీ వివాదం ఎందుకు? ఎలా మొదలైందన్నది చూస్తే.. కర్నూలు జిల్లా ఎంపిక కమిటీ తనను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ గా ఎంపిక చేయకపోవటాన్ని సవాలు చేస్తూ జిల్లాకు చెందిన మదన సుందర్ గౌడ్ 2019లో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పోస్టుకు పిటిషనర్ పేరును పరిగణలోకి తీసుకోవాలని.. రెండు వారాల్లో తగిన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయితే.. వాటి అమలు జరగకపోవటంతో పిటిషనర్ కోర్టు ధిక్కార వ్యాజ్యాన్ని వేశారు. దీనిపై లోతైన విచారణ జరిపిన న్యాయమూర్తి.. 2019 సెప్టెంబరు 27న ఐఏఎస్ అధికారి పూనం మాలకొండయ్య.. కోర్టు ఆదేశాల్ని ఐఏఎస్ అధికారి అరుణ్ కుమార్ కు సూచనలు చేయటం తప్పించి.. ఎలాంటి చర్యలూ తీసుకోలేదని తప్పు పట్టింది.

మరోవైపు కోర్టు ఆదేశాలకు అరుణ్ కుమార్.. వీర పాండియన్ తగిన ఆదేశాలు ఇవ్వకపోవటం గమనార్హం. కోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలైన తర్వాత స్పీకింగ్ ఉత్తర్వుల్ని ఇవ్వకపోవటం.. కోర్టు ఆదేశాల్నిఅమలు చేసే విషయంలో ముగ్గురు ఐఏఎస్ అధికారుులు నిర్లక్ష్యం చేశారని సింగిల్ బెంచ్ అభిప్రాయపడింది. కోర్టు ఉత్తర్వుల్ని అమలులో ఆలస్యమయ్యే వేళలో.. తమకు ఎదురవుతున్న ఇబ్బంది గురించి న్యాయస్థానానికి తెలిపి.. సమయం పొడిగింపునకు అభ్యర్థించొచ్చు.. కానీ.. ప్రస్తుత కేసులో అలాంటి ప్రయత్నాలు ఏమీ జరగలేదు. దీనికి తోడు.. కోర్టుకు హాజరయ్యే విషయంలో మాలకొండయ్య సానుకూలంగా స్పందించలేదు.

మొత్తంగా కోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయటంలో వైఫల్యంతో పాటు.. కోర్టు ఎదుట హాజరు కాకపోవటంతో.. సింగిల్ బెంచ్ కోర్టు సంచలన ఆదేశాల్ని జారీ చేశారు. దీంతో.. కళ్లు తెరిచిన ఐఏఎస్ అధికారులు డ్యామేజ్ కంట్రోల్ చర్యల్లో భాగంగా హైకోర్టు ఉత్తర్వుల అమలు నిలిపివేయాలని కోరటంతో జైలు ముప్పు తప్పింది. లేనిపక్షంలో జైలుకు వెళ్లాల్సి వచ్చేది.