ఉత్తరాంధ్రకు ఛాయిస్ ఇచ్చిన చంద్రబాబు

క్విజ్ లో పార్టిసిపెంట్ కు ఛాయిస్ ఇచ్చినట్లే చంద్రబాబునాయుడు ఉత్తరాంధ్ర జనాలకు ఛాయిస్ ఇచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమంలో విశాఖపట్నంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖపట్నం రాజధానిగా కావాలా ? లేకపోతే విశాఖపట్నం అభివృద్ధి కావాలా ? అని ప్రశ్నించారు. ఛాయిస్ ఇస్తే ఎవరైనా విశాఖను రాజధానిగా కావాలనే అనుకున్నారేమో.. కొద్దిసేపటి తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ రాజధానిగా అమరావతిని డెవలప్ చేస్తానని, విశాఖను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు.

విశాఖతో తనకున్న అనుబంధాన్ని నెమరేసుకున్నారు. హుద్ హుద్ తుపాను వస్తే వారం రోజుల్లో తాను నగరాన్ని సాధారణ స్ధితికి తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. అప్పట్లో తాను ఒక్క పిలుపిస్తే జనాలు దీపావళి పండుగ కూడా జరుపుకోలేదన్నారు.

విశాఖపట్నం అభివృద్ధికి తాను ఎన్నో కంపెనీలను తీసుకొచ్చినట్లు చెప్పారు. విశాఖ అభివృద్ధికి తాను ఎంతో కష్టపడితే అధికారంలోకి వచ్చిన జగన్ తన కష్టాన్ని చెడగొట్టేసినట్లు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం వల్ల విశాఖ నుండి కంపెనీలన్నీ వెళ్ళిపోయినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఎన్నోరకాల సహజవనరులు ఉన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. వాటన్నింటినీ సక్రమంగా వాడుకుంటే ఏపీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలవటం ఖాయమని జోస్యం కూడా చెప్పారు.

జగన్ పాలనలో నిత్యావసర ధరలన్నీ పెరిగిపోతున్నాయన్నారు. పెట్రోల్, డీజల్, గ్యాస్ ధరలను జగన్ ఎందుకు తగ్గించటంలేదంటు మండిపడ్డారు. ఏపీలో ఉన్న పెట్రోల్ ధరలకన్నా ఇంకేదైనా రాష్ట్రంలో ఎక్కువున్నట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ఛాలెంజ్ చేశారు. నాడు-నేడు పేరుతో స్కూళ్ళకు వైసీపీ రంగులేసినట్లు ఆరోపించారు.

గతంలోనే ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయద్దని కోర్టు చివాట్లు పెట్టినా జగన్ ప్రభుత్వం తన పద్దతి మార్చుకోలేదంటు రెచ్చిపోయారు. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల కష్టపడి చదివే విద్యార్ధులు నష్టపోతారన్నారు. ప్రశ్నపత్రాలు లీకవుతుంటే విద్యాశాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు.