మోడీ మ‌న‌సు గెలుకునేందుకు క‌ష్ట‌ప‌డుతున్న విజ‌య‌సాయిరెడ్డి

వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, ఆ పార్టీ ముఖ్య నేత విజ‌య‌సాయిరెడ్డి పార్టీ రాజ‌కీయాల్లో ఎంత యాక్టివ్‌గా ఉంటారో సోష‌ల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్‌గా ఉంటుంటారు. వైఎస్ఆర్‌సీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌గా ఉన్న విజ‌య‌సాయిరెడ్డి జాతీయ రాజ‌కీయాల్లోని వివిధ ప‌రిణామాల‌పై కూడా అదే రీతిలో స్పందిస్తుంటారు.

అయితే, ఇప్పుడు ఏకంగా ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ క‌ళ్ల‌ల్లో ప‌డేందుకు విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆయ‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ నేపాల్ టూర్‌పై విజ‌య‌సాయిరెడ్డి చేసిన కామెంట్ల‌ను ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా చెప్తున్నారు.

దేశంలో రాజ‌కీయాలు హాట్ హాట్‌గా మారిపోయిన స‌మ‌యంలో రాహుల్ గాంధీ ఖాట్మండులోని నైట్ క్లబ్ లో ఓ మహిళ ప‌క్కన ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ వీడియోలో రాహుల్ పక్కన ఉన్న ఆ మహిళ ఎవరు అనేదానిపై జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ వీడియోపై బీజేపీ నేతలు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కాంగ్రెస్ నేత‌లు స‌మ‌ర్థిస్తూ వివ‌ర‌ణ‌లు ఇస్తున్నారు. అయితే, ఈ స‌మ‌యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వైర‌ల్‌గా మారిన‌ రాహుల్ గాంధీ వీడియోపై సంచలన ట్వీట్ చేశారు.

రాహుల్ టూర్‌పై కొన‌సాగుతున్న రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కు మ‌రింత ఆజ్యం పోసేలా విజ‌య‌సాయిరెడ్డి స్పందించారు. ‘చైనా దౌత్యవేత్తలతో నేపాల్ నైట్ క్లబ్‌లో పార్టీలు చేసుకోవడం కలవరపెడుతోంది. చైనా హనీ ట్రాప్‌లు పెరుగుతున్నాయి. నేపాల్‌లోని చైనా రాయబారి హౌ యాంకీ కూడా అతనితో కనిపించారు. ప్రధాని మోడీ యూరప్ పర్యటనపై కాంగ్రెస్ అనవసరంగా ప్రశ్నించింది’ అని ట్వీట్ చేశారు.

ఇప్ప‌టికే రాహుల్ టూర్ రాజ‌కీయ రంగు పులుముకోగా దానికి హనీ ట్రాప్ అంశం జోడించ‌డం అంటే బీజేపీ పెద్ద‌ల దృష్టిలో ప‌డేదుకు చేసిన ఎత్తుగ‌డే అని సోష‌ల్ మీడియాలో కాంగ్రెస్ వ‌ర్గీయులు కామెంట్ చేస్తున్నారు.