ఓటుకు నోటు తీసుకోవడం మానేయలేమా

ఎన్నికల్లో నోట్లు పంపిణీ చేస్తేనే ఓట్లు వేయడం మామూలైపోయింది. గత కొన్నేళ్లుగా ఈ దుస్సాంప్రదాయం పెరిగిపోయింది. దీంతో నిజంగా ప్రజలకు సేవ చేస్తున్న నాయకులు ఓటమి పాలవుతున్నారు. లక్ష పెట్టుబడి పెట్టి కోటి సంపాదించాలనుకునే రాజకీయ వ్యాపారులు గెలుస్తున్నారు. దీనివల్ల చట్ట సభల్లో ప్రజల గొంతు వినిపించడం ఆగిపోయింది. రాజకీయ అవినీతి పెచ్చు మీరింది. ఫలితంగా అభివృద్ధి కుంటు పడుతోంది. అదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేసి ఏడాది పూర్తయిన సందర్బంగా ఉండవల్లి లోని క్యాంప్ కార్యాలయం నుంచి మహిళలతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. మహిళలతో చంద్రబాబు మాట్లాడుతూ… ఎన్నికల్లో డబ్బులు తీసుకొని ఓటు వేయడం మానేయాలని సూచించారు. ఏ నాయకుడు కూడా ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని రాడని, వాళ్ళు పంపిణీ చేసేదాంత అవినీతి సొమ్మే అని చెప్పారు.

ఓటుకు 2 వేలు ఇచ్చిన వాళ్ళు గెలిచిన తర్వాత 2 లక్షలు సంపాదించుకుంటారు. వాళ్ళు సంపాదించే అవినీతి సొమ్ములో మీకు చిల్లర పైసలు విదుల్చుతారనికి చెప్పారు. ఒకసారి ఓటు అమ్ముకున్నాక నాయకులను ప్రశ్నించే పరిస్థితి ఉండదు. మనం చులకన అయిపోతాం. ఎన్ని పనులు చేసినా ఎవడు పది రూపాయలు ఎక్కువ ఇస్తే వాళ్లకు ఓటేస్తున్నారు. ఇది సరికాదని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. వరసగా మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో ధన ప్రవాహన్ని ఇప్పటి నుంచే అడ్డుకోవాలి. అది మహిళల నుంచే ప్రారంభం కావాలని ప్రజాస్వామిక వాదులు చర్చిస్తున్నారు. నోటుకు ఓటును అడ్డుకున్నప్పుడే సచ్చరిత కలిగిన నాయకులు ఎన్నికవుతారని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.