ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీలు, మునిసిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహిస్తారు. అయితే.. దీనికి ప్రభుత్వం అనుమతించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి గత ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికల విషయం వచ్చినప్పుడు.. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలనిఅప్పటి కమిషనర్ నీలం సాహ్ని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు.
కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలపై ఎన్నికలు నిర్వహించాలంటే.. సుమారు 400 కోట్ల రూపాయల మేరకు వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై మౌనం వహించింది. మరోవైపు స్థానిక సమరానికి సమయం దగ్గర పడుతున్న క్రమంలో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు-అక్టోబరు మాసాల మధ్య వీటిని నిర్వహించనున్నారు. తొలుత మునిసిపాలిటీ, తర్వాత కార్పొరేషన్లు, ఆ తర్వాత గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సర్కారు సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు బ్యాలెట్ను ఎంచుకున్నారని ఒక వార్త చక్కర్లు కొడుతుంది.
వైసీపీ ఆరోపణలకు చెక్!
గత 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లు మాత్రమే దక్కాయి. అప్పట్లో జగన్..“ఏం జరిగిందో ఏమో..“ అంటూ.. ఈవీఎం లపై అనుమానాలు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గత ఏడాది చేసిన ఈవీఎంలపై విమర్శలను కూడా ఆయన పరోక్షంగా సమర్థించారు. తరచుగా వైసీపీ నాయకులు కూడా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్థానిక సమరంలో బ్యాలెట్పైనే ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో వైసీపీ ఏమేరకు పుంజుకుంటుందన్నది ప్రశ్న. వాస్తవానికి ఇప్పటి వరకు చేసిన ఆరోపణలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. బ్యాలెట్ విధానం నిర్వహించడం గమనార్హం.
స్థానికం మొగ్గు ఇటే!
సాధారణంగా స్థానిక ఎన్నికలు అనగానే అధికార పార్టీలకు అనుకూలంగానే జరుగుతుంటాయి. ప్రజలు కూడా అధికారంలో ఉన్న పార్టీలవైపే మొగ్గు చూపుతారు. సంక్షేమం, అభివృద్ధి వంటివి అప్పటికి ప్రభావం చూపిస్తాయి. ఈ సారి ఏపీలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంటుందన్న అంచనా ఉంది. మరోవైపు కూటమి కూడా బలంగా ఉండడం, క్షేత్రస్థాయిలో సమన్వయానికి ప్రాధాన్యం మరింత పెంచుతున్న దరిమిలా.. స్థానిక ఎన్నికల్లో విజయం కూటమి వైపే ఉంటుందన్న అంచనాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా వైసీపీకి.. బ్యాలెట్ ఎన్నికల విధానం బిగ్ టెస్టుగా మారనుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates