భోగాపురం టూ సింగపూర్… బాబు గారి దిల్ ఖుష్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని భోగాపురంలో అధునాతన వ‌స‌తుల‌తో నిర్మించిన అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్ర‌యం కార్య‌కలాపాలు ఆదివారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల త‌ర్వాత నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు విశాఖప‌ట్నానికి వ‌స్తున్న జాతీయ‌, అంత‌ర్జాతీయ విమానాలు ఇక ఆదివారం అర్ధ‌రాత్రి తర్వాత నుంచి అల్లూరి విమానాశ్ర‌యానికే రానున్నాయి. ఈ మేర‌కు విమాన‌యాన సంస్థ షెడ్యూల్‌ను నిర్దేశించింది. దీంతో భోగాపురం విమానాశ్ర‌యంలో అధికారికంగా కార్యక‌లాపాలు సోమ‌వారం తెల్ల‌వారు జాము నుంచి ప్రారంభం అవుతాయి.

ఫ‌స్ట్ ఫ్లైట్ సింగ‌పూర్ నుంచే..

విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యంలో పూర్తిస్థాయి వాణిజ్య విమాన సర్వీసులు ఆదివారం అర్ధ‌రాత్రి నుంచి అందుబాటులోకి రానున్నాయి. కాగా విశాఖపట్నం విమానాశ్రయంలో పౌర విమానయాన సేవలను పూర్తిగా నిలిపివేయనున్నారు. ఈ నేప‌థ్యంలో విశాఖ నుంచి నడిచే అన్ని విమానాలు ఇకపై భోగాపురం నుంచే రాకపోకలు సాగిస్తాయి.

ప్రధాన విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిర్ ఇండియా తమ సర్వీసుల షెడ్యూల్‌ను విడుదల చేశాయి. వీటి ప్ర‌కారం సింగపూర్ నుంచి వచ్చే `స్కూట్ ఎయిర్‌లైన్స్` తొలి విమానం ఆదివారం అర్ధ‌రాత్రి 12.11 నిమిషాల‌కు భోగాపురంలోని అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్ర‌యంలో ల్యాండ్ అవుతుంది. ఇండిగో సర్వీసులు రేప‌టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఒక్క ఇండిగోనే తొలి రోజు 35 విమానాల‌ను భోగాపురం నుంచి ప్రారంభించ‌నుంద‌ని అధికారులు తెలిపారు.

చంద్ర‌బాబు సంతోషం..

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు.. సింగ‌పూర్‌కు ఉన్న అనుబంధం తెలిసిందే. అమ‌రావ‌తి రాజ‌ధాని మాస్ట‌ర్ ప్లాన్‌ను ఆ దేశ‌మే ఇచ్చింద‌ని.. దీనికి ఒక్క రూపాయి కూడా చార్జి తీసుకోలేద‌ని ఇటీవ‌ల చంద్ర‌బాబు వివ‌రించారు. అంతేకాదు.. ఆయ‌న ప‌లు మార్లు ఆ దేశంలో ప‌ర్య‌టించారు. అమ‌రావ‌తికి సంబంధించిన ప‌లు అంశాల్లో సింగ‌పూర్ ప్ర‌తినిధుల స‌ల‌హాలు, సూచ‌న‌లు కూడా తీసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న సింగ‌పూర్ నుంచి వ‌చ్చే విమాన‌మే భోగాపురంలో కార్య‌క‌లాపాల‌ను ప్రారంభించ‌నుండ‌డం విశేషం.

దీనిపై చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు. ఉత్త‌రాంధ్ర‌కు మంచి రోజులు ప్రారంభ‌మ‌య్యాయ‌ని తెలిపారు. మ‌రోవైపు ఆదివారం అర్ధ‌రాత్రి భోగాపురానికి చేరుకునే సింగ‌పూర్ విమానానికి సంప్ర‌దాయ బ‌ద్ధంగా స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు మంత్రులు కూడా పాల్గొంటారు.