PK: ఎక్కువగా ఊహించుకుంటున్నారా?

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే)తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారా ? ఇపుడిదే చర్చ రాజకీయవర్గాల్లో మొదలైంది. రాజకీయ నేత వేరు రాజకీయ వ్యూహకర్త వేరు. రాజకీయ నేతలు 24 గంటలూ జనాల్లోనే తిరుగుతుంటారు. కాబట్టి జనాలతో ప్రత్యక్ష సంబందాలుంటాయి. రాజకీయ వ్యూహకర్తలు ఎప్పుడూ తెరవెనుకే ఉంటారు. వీళ్ళకు జనాలతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు ఉండవు.

ఇపుడిదంతా ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయంలో పీకే తాజాగా చేసిన ట్వీట్ తోనే పార్టీల్లో  గందరగోళం మొదలైంది. తాను రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా దిగుతున్నట్లు కానీ, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు కానీ పీకే డైరెక్టుగా ట్వీట్లో చెప్పలేదు. డైరెక్టుగా చెప్పకుండా అడ్డదిడ్డంగా వంకర టింకరగా ఒక ట్వీట్ చేశారు. దానిమీద రాజకీయ పార్టీల్లోను, మీడియాలో విశ్లేషణలు మొదలైపోయాయి.

సరే సంవత్సరాలుగా రాజకీయ పార్టీల తోను, ప్రముఖ నేతలతో సన్నిహితంగా తిరుగుతున్నారు కాబట్టి బహుశా పీకేకి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేయాలని అనిపించిందేమో. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, పార్టీలు పెట్టొచ్చు కాబట్టి పీకేకి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చు.  అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయాల్లోకి వచ్చినంత మాత్రాన, పార్టీ పెట్టినంత మాత్రాన పీకే సక్సెస్ అవుతారా ? ఇపుడిదే పెద్ద ప్రశ్న.

ఎంతో ప్రజాకర్షణ ఉన్న నేతలు కూడా ఎన్నికల్లో చతికిల పడిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. పీకే వ్యూహాలతో మాత్రమే నరేంద్ర మోడీ, జగన్, నితీష్ కుమార్, మమతా బెనర్జీ, స్టాలిన్ అధికారంలోకి రాలేదు. వాళ్ళతో పాటు వాళ్ళ పార్టీల్లో దమ్ముంది. ప్రజలను ఆకర్షించే దమ్ముంది కాబట్టే జనాలు కూడా సానుకూలంగా స్పందించారు. అంటే క్షేత్రస్థాయిలో పై పార్టీలకు జనాల సానుకూలతుంది. దీనికి పీకే వ్యూహాలు శాస్త్రీయంగా ఉపకరించాయంతే.

అచ్చంగా పీకేనే గెలిపించేట్లయితే పార్టీలను గెలిపిచేంట్లయితే యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది ? గోవా ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయింది ? రేపు పీకే పార్టీ పెట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా సక్సెస్ ఎంతుంటుందో చెప్పలేం. ఏదేమైనా చాలామంది నేతలను చూసిన తర్వాత తనను తాను చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని మాత్రం అనిపిస్తోంది.