‘ఏపీలో అహంకార పాలన సాగుతోంది’

ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కారుపై కేంద్ర సహాయమంత్రి కిషన్ రెడ్డి సంచలనవ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ఇంత సూటిగా.. చురుకు తగిలేలా వ్యాఖ్యలు చేసిన నేతలు లేరనే చెప్పాలి. ఏపీకి చెందిన బీజేపీ నేతలు జగన్ సర్కారుపై విమర్శలు చేసినా కూడా ఇంత ఘాటుగా చేయలేదన్న మాట వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పోలీసు రాజ్యం కొనసాగుతోందని.. అవినీతి.. ఆరాచకం.. దౌర్జన్యాలు కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నారు.

ఏదైనా ప్రదర్శనలో పాల్గొన్నా.. సోషల్ మీడియాలో అభిప్రాయాల్ని వెల్లడించినా.. పోలీసులు కేసులు పెడుతూ వేధిస్తున్నట్లుగా మండిపడ్డారు. తనకు సైతం కంప్లైంట్లు వస్తున్నట్లుగా వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి.. ‘‘ఏపీలో అహంకార పాలన సాగుతోంది’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాజాగా నిర్వహించిన వర్చువల్ ర్యాలీలో హైదరాబాద్ నుంచి మాట్లాడిన ఆయన.. నాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.

అప్పట్లో చంద్రబాబు హయాంలో అవినీతి.. అసత్యాల పాలన సాగితే.. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి డీసెంట్రలైజ్ అయ్యిందన్నారు. సీఎం పదవులు చేపట్టిన రాయలసీమ నేతలు.. తమ ప్రాంతాన్ని మాత్రం డెవలప్ చేయలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి ప్రాజెక్టులు.. నిధులు తీసుకొని కూడా రాష్ట్రానికి ఏమీ చేయలేదన్న ఆయన తీరుచూస్తే.. జగన్.. చంద్రబాబుకు ప్రత్యామ్నాం తామేనన్న విషయాన్ని తన విమర్శలతో చెప్పే ప్రయత్నం చేశారని చెబుతున్నారు.

ఓపక్క కేంద్రంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సఖ్యతగా ఉన్నప్పటికీ.. కేంద్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి జగన్ సర్కారుపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా కీలకమన్న మాట వినిపిస్తోంది. ఇంత ఘాటైన పదజాలంతో విరుచుకుపడాలంటే కచ్ఛితంగా మోడీషాల పర్మిషన్ ఉండి ఉండాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారిచ్చిన సంకేతాలతోనే కిషన్ రెడ్డి ఇంతలా చెలరేగిపోయి ఉంటారంటున్నారు. అదే నిజమైతే.. జగన్ ప్లాన్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.