సంక్షేమ పథకాలతో ఓట్లు పడతాయా?

గడచిన మూడేళ్ళల్లో రు. 1.36 లక్షల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో ఖర్చు చేశాం కాబట్టి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ 151 సీట్లు రావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి బల్లగుద్దకుండా చెప్పారు. ఇపుడు చేసిన ఖర్చే కాకుండా రాబోయే రెండేళ్ళల్లో మరో లక్ష కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు చెప్పారు. మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ  సమన్వయ కర్తలతో జరిగిన సమావేశంలో జగన్ పై వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే చాలామందిలో ఒక సందేహం మొదలైంది.

ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తోంది కాబట్టి 175 సీట్లకు 175 సీట్లూ గెలుచుకోవాల్సిందే అని టార్గెట్ కూడా పెట్టారు. అయితే సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన జనాలు మళ్ళీ ఓట్లేసేస్తారా ? ఏ రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే 70-30 నిష్పత్తిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవ్వాలి. అయితే ఈ నిష్పత్తి ఎప్పుడో తల్లకిందులైపోయింది. ఎప్పుడైతే ఉచిత హామీలు తెరపైకి వచ్చాయో అప్పుడే రాష్ట్రాలతో పాటు దేశ ఆర్ధిక పరిస్ధితి కూడా తల్లకిందులైపోయింది.

సరే సంక్షేమ పథకాలు అమలు చేసినంత మాత్రాన జనాలు ఓట్లేయరన్న విషయాన్ని జగన్ ముందు గ్రహించాలి. ప్రజలు ఏ పార్టీకి ఎందుకు ఓట్లేస్తారో కూడా ఎవరు ఊహించలేరు. మొన్నటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మంచి నేతలుగా పేరున్న వాళ్ళు ఓడిపోయారు. అలాగే క్రిమినల్ కేసుల్లో శిక్షలు అనుభవిస్తు జైల్లో ఉన్న  ఇద్దరు నేతలు మంచి మెజారిటీతో గెలిచారు. మంచివాళ్ళను జనాలు ఎందుకు ఓడగొట్టారు ? అదే జనాలు క్రిమినల్స్ ను ఎందుకు గెలిపించారు ? అంటే ఈ ప్రశ్నకు ఎవరు  సమాధానం చెప్పలేరు. అలాగే ఒక్క సంక్షేమ పథకాలే వైసీపీని తిరిగి గెలిపించలేవని జగన్ తెలుసుకోవాలి.

సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధిని కూడా చూపించే జనాలను ఓట్లడగాలి. అప్పుడు జనాలు సానుకూలంగా స్పందిస్తే వైసీపీ రెండోసారి గెలిచేందుకు అవకాశముంటుంది. అభివృద్ధితో పాటు లా అండ్ ఆర్డర్ కూడా అదుపులో ఉండాలి. ప్రజాప్రతినిధులు జనాలకు అందుబాటులో ఉండాలి. అన్నీ కలిసొస్తేనే ఎవరైనా గెలవగలరు. వీటిల్లో ఏది మిస్సయినా అంతే సంగతులు.