జానారెడ్డికి కీల‌క ప‌ద‌వి.. ఆ నేత‌లు స‌హ‌క‌రించేనా?

తెలంగాణ‌పై కాంగ్రెస్ అధిష్ఠానం ఈసారి ప్ర‌త్యేక దృష్టి సారించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా అధికారమే ల‌క్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకోసం ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ రూపొందిస్తోంది. ముఖ్యంగా పాత కాపుల‌ను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వివిధ కార‌ణాల‌తో గ‌తంలో పార్టీని వీడిన వారిని.. ఇత‌ర పార్టీల్లో ఆస‌క్తి ఉన్న నేత‌ల‌ను కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.

అందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ‌కీయ దురంధ‌రుడు జానారెడ్డికి అధిష్ఠానం కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించింది. జానారెడ్డి చైర్మ‌న్‌గా చేరిక‌ల‌పై ప్ర‌త్యేక క‌మిటీ వేసింది. పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మాజీ పీసీసీ చీఫ్‌లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, మాజీ డిప్యూటీ సీఎం దామోద‌ర రాజ‌న‌ర్సింహ ఇందులో స‌భ్యులుగా ఉన్నారు.

వ‌చ్చే నెల 6, 7 తేదీల్లో పార్టీ అగ్రనేత రాహుల్ రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. మొద‌టి రోజు వ‌రంగ‌ల్ లో భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన‌నున్న రాహుల్‌.. రెండో రోజు హైద‌రాబాద్ లో పార్టీ నేత‌ల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం అవుతున్నారు. అయితే.. ఈలోగానే పార్టీలో కొంద‌రి చేరిక‌ల‌పై స్ప‌ష్ట‌త‌కు రావాల‌ని టీపీసీసీ భావిస్తోంది. వారిని వ‌రంగ‌ల్ స‌భ‌లో రాహుల్ స‌మ‌క్షంలో చేర్చేలా చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

పీసీసీ చీఫ్‌గా రేవంత్ నియ‌మితులైన‌ప్పుడే పార్టీ సీనియ‌ర్ల‌ను, పాత కాపుల‌ను, ఇత‌ర పార్టీకి చెందిన కీల‌క నేత‌ల‌ను క‌లిసి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ స‌మ‌యంలోనే కొంద‌రిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న‌ మాజీ పీసీసీ చీఫ్ ధ‌ర్మ‌పురి శ్రీ‌నివాస్‌, ఆయ‌న కుమారుడు సంజ‌య్ ని పార్టీలోకి తీసుకోవాల‌ని భావించారు. మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లో ఎర్ర శేఖ‌ర్‌, ఇంకా కొంద‌రు నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. అయితే.. ఆయా జిల్లాల్లో ఉన్న పార్టీ సీనియ‌ర్లు వారి చేరిక‌ను అడ్డుకున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. లేదంటే ఈటెల రాజేంద‌ర్ కూడా ఈపాటికే కాంగ్రెస్ లో కీల‌కంగా ఉండేవారట‌.

ఇటీవ‌ల రాహుల్ తో భేటీలో ఈ విష‌య‌మై చ‌ర్చ జ‌ర‌గ‌గా ఆయ‌న సీరియ‌స్ అయ్యార‌ట‌. పార్టీలో చేరేవారిని అడ్డుకోవ‌ద్ద‌ని సూచించార‌ట‌. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు అధిష్ఠానం ఇపుడు ప్ర‌త్యేక క‌మిటీ ప్ర‌క‌టించింది. వెంట‌నే రంగంలోకి దిగిన క‌మిటీ రాహుల్ స‌భ‌లోపు చేర్పించేందుకు కీల‌క నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంద‌ట‌. ఖ‌మ్మం టీఆర్ఎస్ లో ఉన్న ఇద్ద‌రు అసంతృప్తులు.., మ‌హ‌బూబ్ న‌గ‌ర్‌లో ఒక‌రిద్ద‌రు నేత‌లు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి త‌దిత‌రుల‌ను ఆహ్వానిస్తోంద‌ట‌. వీరు నిజంగానే చేరితే అది కాంగ్రెస్ కు బూస్టు ఇచ్చిన‌ట్లే. దీనికి ఆయా జిల్లాల్లో ఉన్న సీనియ‌ర్లు స‌హ‌క‌రిస్తారా.. ఎవ‌రెవ‌రు పార్టీలో చేర‌తారో వేచి చూడాలి.