నెల్లూరు నేత‌ల‌పై.. సీఎం జ‌గ‌న్ సీరియ‌స్‌

నెల్లూరు వైసీపీ పంచాయతీ సీఎం జగన్ వద్దకు చేరింది. మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి, ఆనం విజ‌య్ కుమార్ రెడ్డి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి అనిల్‌కు ముఖ్యమంత్రి నుంచి పిలుపు వచ్చింది. `మాట్లాడుకుందాం రా` అంటూ అనిల్‌కు జగన్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ఈ రోజు  జగన్‌ను అనిల్ కలవనున్నారు. ఇటీవ‌ల మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించిన అనిల్‌.. ఆ వెంట‌నే స‌భ ప‌ట్ట‌డం.. మంత్రి కాకాణిపై వ్యంగ్యాస్త్రాలు సంధించ‌డం తెలిసిందే.

ఫ్లెక్సీల వివాదం సహా అనేక అంశాలను సీరియస్ గా తీసుకున్న సీఎం జ‌గ‌న్‌ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను.. తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. ఈ విషయంపై కాకాణి, అనిల్‌కు సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వీరిద్దరూ మధ్యాహ్నం 3 గంటలకు క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ కానున్నారు ఇరు నేతల మధ్య విభేధాలను సీఎం పరిష్కరిస్తారా?  లేక అనిల్‌కు క్లాస్ ఇస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది.

మంత్రి వర్గ పునర్‌వ్యవస్థీకరణ తర్వాత నెల్లూరు వైసీపీలో విబేధాలు రోడ్డున పడ్డాయి. కాకాణి, ఆనం, విజ‌య్‌కుమార్‌రెడ్డి వర్గాలకు అనిల్ వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఘాటు విమర్శలు చేయడం, ఫ్లెక్సీలు తొలగించడం వంటి వ్యవహారాలతో అనిల్ వైసీపీలో వేడి పెంచారు. ఫ్లెక్సీల వివాదం, మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్ మధ్య మాటల యుద్ధం సెగ‌లు పుట్టించాయి.  

కాకాణి గోవర్ధన్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశాక తొలిసారి నెల్లూరు రావడం.. అదే రోజు అదే నగరంలో మాజీమంత్రి అనిల్ సభ నిర్వహణ ప్రకటనతో వర్గపోరు అనుమానాలు ఊపందుకున్నాయి. బల ప్రదర్శనకు ప్రయత్నిస్తున్నారా అనే ప్రశ్నలూ వచ్చాయి. పోలీసులు కూడా సిబ్బందిని భారీగా మోహరించారు. ఈ క్రమంలో….ఇద్దరు నేతలతోనూ పార్టీ పెద్దలు మాట్లాడినట్లు సమాచారం.

ఎవరి కార్యక్రమాలు వారు.. వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా నిర్వహించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ఫలితంగా వర్గపోరేమీ లేదన్నట్లుగా…. కాకాణి, అనిల్ సభలు ముగించారు. అయినా.. వేడి ఎక్క‌డా చ‌ల్లార‌లేదు. దీంతో ఇప్పుడు.. ఏకంగా ముఖ్య‌మంత్రి పంచాయ‌తీ పెట్టారు. మ‌రి చివ‌రికి ఏం తేలుస్తారో చూడాలి.