వైసీపీ – టీడీపీకి సోష‌ల్ మీడియాతో స‌క్సెస్ ఎంత‌?

సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్ర‌జ‌ల‌పై ఎంత‌? వారిని ఏ మేర‌కు.. పోలింగ్ కేంద్రాల‌కు త‌ర‌లిస్తుంది.?  దీనిని న‌మ్ముకుని విజ‌యం ద‌క్కించుకునే ప‌రిస్థితి ఉందా? ఇదీ.. ఇప్పుడు ఏపీలోని రెండు కీల‌క పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఏ రాజ‌కీయ పార్టీకైనా.. సోష‌ల్ మీడియా ప్ర‌భావం అంతో ఇంతో ఉంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, ట్విట్ట‌ర్ వీటిలో పార్టీ నేత‌లు యాక్టివ్ గా ఉంటున్నా రు. మ‌రీ ముఖ్యంగా ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న మ‌ధ్య‌మాలు.. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లే. దీంతో వీటిలో త‌మ ఆలోచ‌న‌ల‌ను ప్ర‌ణాళిక‌ల‌ను నాయ‌కులు పంచుకుంటున్నారు.

రాజ‌కీయ వేదిక‌గా.. సోష‌ల్ మీడియా మాధ్యాలు ప్ర‌భావం చూపిస్తున్నాయి. ఈ విష‌యాన్ని ఎవ‌రూ కాద‌న‌డం లేదు. అయితే.. ఇవి ఏమేర‌కు.. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేస్తాయి?  ఏమేర‌కు వారిని ఓటు బ్యాంకురాజ‌కీయాల వైపు మారుస్తాయి?  ఎంత వ‌ర‌కు ఓట్లు ల‌భిస్తాయి? అనే విష‌యాలు మాత్రం ఆస‌క్తిగా ఉన్నాయి. ముఖ్యంగా 2014లో టీడీపీ సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. అదేవిధంగా సాధార‌ణ మీడియాలోనూ ప్ర‌చారం హోరెత్తించింది. గెలుపు గుర్రం ఎక్కింది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియా ద్వారానే త‌మ‌కు ఓట్లు భారీగా వ‌చ్చాయ‌ని భావించింది. ఇదే సూత్రాన్ని 2019లోనూ అప్ల‌యి చేసినా.. ఫ‌లితం ద‌క్క‌లేదు.

ఇక‌, వైసీపీ విష‌యాన్ని తీసుకుంటే.. టీడీపీ మాదిరిగా సోష‌ల్ మీడియాలో వైసీపీ యాక్టివ్‌గానే ఉన్నా.. ఆ పార్టీ న‌మ్ముకున్నంతగా.. మాత్రం పూర్తిగా సోష‌ల్ మీడియాపై వైసీపీ ఆధార‌ప‌డ‌లేదు. దీంతో ఎక్కువ‌గా ప్ర‌జ‌ల్లో ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇది 2019లో విజ‌యం దిశ‌గా న‌డిపించింద‌ని ఆ పార్టీ న‌మ్ముతోంది. అయితే.. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల‌కు అనుగుణంగా.. తాము కూడా మ‌రింత మారాల‌ని వైసీపీ నిర్ణ‌యించుకుంది. అంటే.. టీడీపీ మాదిరిగా సోష‌ల్ మీడియాను మ‌రింత విస్తృత ప‌ర‌చాల‌ని నిర్ణ‌యించుకుంది.

ఈ నేప‌థ్యంలో రెండు పార్టీల‌కూ ఇప్పుడు సోష‌ల్ మీడియా ప్ర‌ధాన అస్త్రంగా మారింది. ఈ క్ర‌మంలోనే కొన్ని రోజులుగా రెండు పార్టీలూ.. సోష‌ల్ మీడియాలో ఉపాధి క‌ల్పించి.. కార్య‌క‌ర్త‌ల‌ను కూడా నియ‌మించుకున్నా యి. ఎక్క‌డ ఏం జ‌రిగినా.. టీడీపీ చేస్తున్న కామెంట్ల‌కు వైసీపీ కూడా కౌంట‌ర్ ఇస్తోంది. కానీ, ఇప్పుడు రెండు పార్టీల్లోనూ.. ఈ సోష‌ల్ మీడియా ఏమేర‌కు ఆశించిన ఫ‌లితాన్ని అందిస్తుంద‌నే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం సోష‌ల్ మీడియాను ఎక్కువ‌గా వాడుతోంది. వారిలో స‌గం మంది కూడా ఓటు వేయడానికి రావ‌డం లేదు. అలాగ‌ని.. ప‌క్క‌న పెట్టేందుకు కూడా వీలు లేదు. ఈ నేప‌థ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తూ.. అటు జ‌నంలోకి వెళ్ల‌డంతోపాటు.. ఇటు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండ‌డ‌మే మంచిద‌ని.. దీనిపైనే ఎక్కువ‌గా ఆధార‌ప‌డ‌రాద‌ని.. రెండు పార్టీల నేత‌లు చ‌ర్చలు చేస్తున్నారు.