ప్రతిపక్షాలు కేసీయార్ కు హ్యాండిచ్చాయా ?

జాతీయస్ధాయిలో తాజాగా మొదలైన రాజకీయ పరిణామాల్లో ఇపుడిదే హాట్ టాపిక్ అయ్యింది. దేశంలో పెరిగిపోతున్న మత విద్వేషాలు, విద్వేష ప్రకటన తదితరాలపై దేశంలోని ప్రతిపక్షాల అధినేతలు నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో 13 పార్టీల అధినేతల సంతకాలున్నాయి. అందులో కేసీయార్ సంతకం మాత్రం ఎక్కడా కనబడలేదు. దీనికి కారణం ఏమిటంటే అన్నీ పార్టీలు కేసీయార్ ను అసలు సంప్రదించనే లేదని తాజా సమాచారం.

నరేంద్రమోడి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంటని బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుకు తాజా పరిణామాలు పెద్ద బ్రేకు వేసేట్లుగానే ఉంది. ఇప్పటికే కేసీయార్ ను ఏ పార్టీ కూడా నమ్మటంలేదు. కాంగ్రెస్ లేకుండా జాతీయస్ధాయిలో ఫ్రంట్ సాధ్యం కాదన్న శరద్ పవార్, ఉద్ధత్ థాక్రే వాదనకు మెల్లిగా సానుకూలత కనిపిస్తోంది. వీళ్ళ వాదనతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏకీభవించినట్లు సమాచారం.

కాంగ్రెస్ తో కలిసేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈమధ్యనే ఢిల్లీలో కేసీయార్ పెద్ద షో చేసినా ప్రతిపక్షాల అధినేతలు ఎవరు పెద్దగా కనబడలేదు. అంటే అందరు మాట్లాడుకునే కేసీయార్ ను దూరం పెట్టారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జాతీయస్ధాయిలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం. అలాంటి పార్టీని దూరంగాపెట్టి జాతీయ స్ధాయిలో ఫ్రంట్ ఏర్పాటు సాధ్యంకాదని చాలా ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నాయి.

ఇదే విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివశేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ పదే పదే చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానంటు ఇంతకాలం చెబుతున్న మమతాబెనర్జీ కూడా తాజాగా కాంగ్రెస్ లేకుండా పోరాటాలు సాధ్యంకాదని అంగీకరించారు. ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోతే అంతిమంగా లబ్దిపొందేది బీజేపీ మాత్రమే అని మొత్తానికి మమతాబెనర్జీ, కేజ్రీవాల్ లాంటివాళ్ళు అంగీకరించారు. ఇలాంటి అనేక కారణాల వల్ల, ట్రాక్ రికార్డు కారణంగానే 13 పార్టీలు కేసీయార్ సంతకం అవసరం లేదని తేల్చుకున్నాయట. అందుకనే ఎవరు కేసీయార్ ను కలుపుకుని వెళ్ళటానికి ఇష్టపడలేదు. కాబట్టి కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు మిగిలిన పార్టీలు హ్యాండిచ్చినట్లే అనిపిస్తోంది.