క్రెడిట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ ఆరాటం

తమ వల్లే యాసంగి ధాన్యం కొనుగోలుకు కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించినట్లు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నాయి. ధాన్యం కొనుగోలు ఎవరు చేయాలనే విషయమై గడచిన ఆరు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం-రాష్ట్ర ప్రభుత్వం మధ్య పెద్ద వివాదం నడిచిన విషయం తెలిసిందే. ఇదే విషయమై కేంద్రంపై యుద్ధమన్నారు, భూకంపం సృష్టిస్తానని కేసీయార్ భీకరమైన ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ తో పాటు ఢిల్లీలో కూడా కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేసిన విషయం తెలిసిందే. కేసీయార్ ఎంత గోల చేసినా కేంద్రం దిగి రాకపోవడంతో వేరే దారిలేక బాయిల్డ్ రైస్ ను కొనాలని కేసీయార్ ప్రభుత్వం డిసైడ్ చేసింది. మరో రెండు నెలల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. బాయిల్డ్ రైస్ వాడకం ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోయింది కాబట్టి కొనుగోలు చేయలేమని గతంలోనే కేంద్రం స్పష్టం చేసింది.

కేంద్రం ప్రకటించినా సరే తెలంగాణాలో మాత్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందే అని కేసీయార్ పెద్ద రచ్చచేశారు. అయినా ఉపయోగం లేకపోవటంతో వేరే దారి లేక తమ ప్రభుత్వంతోనే కొనిపించాలని నిర్ణయించారు. ఇదే విషయంలో ధాన్యం కొనుగోలుకు కేసీయార్ ప్రభుత్వం నిర్ణయించటం తమ ఒత్తిడి వల్లే అంటు ఒకవైపు బీజేపీ మరోవైపు కాంగ్రెస్ క్రెడిట్ క్లైం చేసుకుంటున్నాయి. కేసీయార్ ప్రభుత్వంపై తాము పెట్టిన ఒత్తిళ్ళ వల్లే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు బీజేపీ చీఫ్ బండి సంజయ్ చెబుతున్నారు.

ఇదే సమయంలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తాము నిర్వహించిన ఆందోళనల కారణంగానే ప్రభుత్వం దిగొచ్చినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ వాళ్ళు మాత్రం రాష్ట్రంలో జరిగిన ఆందోళనలతో కేంద్రం వైఖరి బయటపడిందన్నారు. చివరకు ఈ క్రెడిట్ క్లైం ఏ స్థాయికి చేరుకుందంటే ఉనికిలో ఉందో లేదో తెలీని పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా తమ ఒత్తిళ్ల కారణంగానే రైతుల నుంచి ధాన్యం కొనేందుకు కేసీయార్ నిర్ణయించినట్లు చెప్పుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.