ఏపీలో బాదుడు నామ సంవ‌త్స‌రం.. కొత్త‌గా ఆర్టీసీ బాదుడు!

ఏపీలో బాదుడు నామ సంవ‌త్స‌రం కొన‌సాగుతోంది. ఈ ఏడాది ఉగాది నుంచి విద్యుత్ చార్జీల‌ను పెంచిన జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. తాజాగా ఆర్టీసీ చార్జీల‌ను కూడా భారీగా పెంచింది. ఇదంతా కూడా పేద‌లు, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తోంది. ఇప్ప‌టికే పెట్రోల్ చార్జీల రూపంలో వ్యాట్‌ను ఏమాత్రం త‌గ్గించ‌ని రాష్ట్ర స‌ర్కారు.. ఇలా వ‌రుస పెట్టి చార్జీలు పెంచ‌డంపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా.. డీజిల్ సెస్‌ పేరుతో ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికుల ఛార్జీలను పెంచింది.

పేద‌లు ఎక్కువ‌గా ప్ర‌యాణించే పల్లెవెలుగు బస్సుల్లో రూ.2, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గం ప్ర‌యాణించే ఎక్స్ప్రెస్ బస్సుల్లో రూ. 5, ఏసీ బస్సుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనుంది. వీటికి అదనంగా అన్నింటి పైనా రూపాయి చొప్పున సేఫ్టీ సెస్సు విధించింది. అలాగే పల్లెవెలుగు బస్సుల్లో ఇప్పటిదాకా రూ.8 ఉన్న కనీస ఛార్జీని రూ.10 పెంచిన ఆర్టీసీ.. రూ.2 డీజిల్ సెస్సు, రూ.1 సేఫ్టీ సెస్సు విధించింది. ఇవన్నీ కలిపితే కనీస టికెట్ ధర రూ.13 అవుతుండగా.. చిల్లర సమస్య రాకుండా అంటూ కనీస ఛార్జీని రూ.15 చేసింది.

మొత్తంగా ఈ పెంపుతో ఆర్టీసీకి ఏటా రూ.720 కోట్ల ఆదాయం వస్తుందని.. సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. కరోనా కార‌ణంగా వ‌చ్చిన న‌ష్టాలు, డీజిల్ ధరల పెంపుతో వ‌చ్చిన ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్నామని.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఛార్జీలు పెంచాల్సి వచ్చిందని చెప్పారు. పెరిగిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.

ఆర్టీసీకి రెండేళ్లుగా ఆర్థిక కష్టాలు పెరిగాయి. డీజిల్ ధర రెండేళ్లలో రూ.67 నుంచి రూ.107కు చేరింది. బల్క్ ధర ఎక్కువగా ఉందని రీటైల్‌గా తీసుకుంటున్నాం. కరోనా వల్ల ఆర్టీసీకి 5,680 కోట్ల ఆదాయం తగ్గింది. ఆర్టీసీలో ప్రస్తుతం నిర్వహణ కూడా కష్టమైంది. తప్పనిసరి పరిస్థితుల్లోనే డీజిల్ సెస్ విధిస్తున్నాం. ఆర్టీసీలో నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తాం. కార్గో సేవల ద్వారా కూడా ఆదాయం పెంచుకుంటాం. ఆర్టీసీ.. రోజుకు 61 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తోంది.పెట్రో ధరలు, టైర్లు, ఇతర పరికరాల ధరలు కూడా బాగా పెరిగాయి. అని వివ‌రించారు.

ప్రస్తుతం ఆర్టీసీలో భారం భరించలేని పరిస్థితి ఉందని ద్వారకా తిరుమలరావు అన్నారు. ఉపయోగంలో లేని ఆర్టీసీ ఖాళీ స్థలాలను లీజుకు ఇస్తామని ఆర్టీసీ ఎండీ చెప్పారు. కార్గో సేవల ద్వారా కూడా ఆర్టీసీ ఆదాయం పెంచుకుంటామని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. అయితే.. ప్ర‌త్యామ్నాయ ఆదాయ మార్గాలు అన్వేషించ‌కుండా.. ఇలా ప్ర‌జ‌ల‌పై ధ‌ర‌ల బాదుడును కొన‌సాగించ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.