ప‌వ‌న్ నోట జ‌గ‌న్ మాట.. ఆహా ! 

కొత్త జిల్లాల ఏర్పాటే గొప్ప విష‌యం అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి భావిస్తుంటే, అవేవీ వ‌ద్దు ముందు ఛార్జీల త‌గ్గింపుపై మీ విధానం ఏంట‌న్న‌ది  ప్ర‌క‌టించండి చాలు అని జ‌న‌సేన‌తో స‌హా విప‌క్షాలు గ‌గ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల వ‌డ్డ‌నకు మ‌రో సారి కూడా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సిద్ధం అవుతున్నార‌ని లీక్స్ వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే ట్రూ అప్ ఛార్జీలు షురూ అయ్యాయి. ఇవి కాకుండా మ‌రో రూపంలో కూడా ఛార్జీల వ‌డ్డ‌న‌కు జ‌గ‌న్ సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో విద్యుత్ ఛార్జీల అడ్డ‌గోలు పెంపు విష‌యాన్నే హైలెట్ చేస్తూ జ‌నం మ‌ధ్య‌కు వెళ్లేందుకు జ‌న‌సేనాని స‌న్న‌ద్ధం అవుతున్నారు. ఆ రోజు బాబు స‌ర్కారును బ‌ద‌నాం చేసిన జ‌గ‌న్ ఇప్పుడేం చెబుతార‌ని మాట్లాడితే చాలు బ‌షీర్ బాగ్ ఉదంతాన్ని తెర‌పైకి తెచ్చి సింప‌తీ కొట్టేయాల‌ని చూస్తార‌ని, మ‌రి ! ఇవాళ మీరు చేస్తుందేంట‌ని విప‌క్ష పార్టీ టీడీపీ అంటోంది. టీడీపీ గొంతుకు జ‌న‌సేన కూడా శ్రుతి క‌లుపుతోంది. ఇక ప‌వ‌న్ నోట జ‌గ‌న్ మాట.. ఏంట‌న్న‌ది చూద్దాం.

విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఛార్జీల వ‌డ్డ‌న త‌ప్ప‌లేద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. ఆ మాట ఎలా ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఛార్జీల పెంపుపై తీవ్ర స్థాయిలో నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఆస్తి ప‌న్ను ఓ వైపు, నాలా వ‌సూళ్లు మ‌రో వైపు ఇవి  కాకుండా గ్రామాల్లో చెత్త ప‌న్ను వ‌సూలు ఇంకోవైపు దండీగా పిండుకుంటున్నా కూడా డ‌బ్బులు లేవ‌ని చెప్ప‌డం, చిన్న‌పాటి ప‌నులు కూడా చేయ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని విప‌క్ష స‌భ్యులు గొంతెత్తుతున్నారు. జ‌న‌సేన కూడా త‌న‌వంతు బాధ్య‌త‌గా మ‌రో మారు నిర‌స‌న‌లు చెప్పేంద‌కు సిద్ధం అవుతోంది. త్వ‌ర‌లో జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్ క‌న్నా ముందే ప‌వ‌న్ రానున్నారు. అంటే ప్ర‌భుత్వంతో నేరు యుద్ధం షురూ అయింద‌నే చెప్పాలి.

వ‌స్తున్న కాలంలో రెండు పార్టీల మ‌ధ్య వైరం  ఎలా ఉండ‌నుందో అన్న‌ది ప‌వ‌న్ తేల్చారు. ముంద‌స్తు సంకేతాలు కూడా ఇచ్చారు. గ‌తంలో టీడీపీ చేసిన తప్పిదాలు దిద్దాల్సిన బాధ్య‌త వైసీపీపై లేదా అని గ‌ళం వినిపించి త‌న నిర‌స‌న చెప్పారు. అదేవిధంగా విద్యుత్ తో స‌హా వివిధ ఛార్జీల విష‌య‌మై త‌న స్ప‌ష్ట‌మైన వైఖ‌రి ఒక‌టి వినిపించారు. దీంతో విప‌క్షాల‌కు కొత్త శ‌క్తి వ‌చ్చింద‌ని భావించాలి. అప్ప‌టిదాకా ఉన్న ఛార్జీల విష‌య‌మై ఆ రోజు వైసీపీ ఏ విధంగా స్పందించింది అన్న‌ది కూడా ఓ సారి గుర్తుకు తెచ్చుకోవాలని హిత‌వు చెప్పారు. బాదుడే బాదుడు అన్న డైలాగ్ తాను సృష్టించింది కాద‌ని, 2018లో విద్యుత్ ఛార్టీల పెంపు సంద‌ర్భంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డే ఆ మాట అన్నార‌ని గుర్తు చేస్తూ ప్ర‌భుత్వ బాధ్య‌త‌ను కూడా మ‌రో మారు జ్ఞ‌ప్తికి తెచ్చారు. వాళ్లు పెంచారు స‌రే మీరు అధికారంలోకి రాగానే త‌గ్గించాలి క‌దా! అని సూటి ప్ర‌శ్న ఒక‌టి సంధించారు.