తెలంగాణలో కరోనా.. నంబర్ చూస్తే కళ్లు తిరుగుతాయ్

కరోనా టెస్టులు ఎంత ఎక్కువగా చేస్తే అంత ఎక్కువగా కేసులు బయటపడతాయన్నది చాలా సింపుల్ లాజిక్. తెలంగాణలో ఇంతకుముందు తక్కువ టెస్టులు చేేసేవాళ్లు. కేసులు కూడా తక్కువగానే ఉండేవి. కానీ కొన్ని రోజులుగా టెస్టుల సంఖ్య బాగా పెరిగింది. అందుకు తగ్గట్లే కరోనా కేసులు కూడా పెద్ద సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. ఒకప్పుడు రోజుకు 50-100 మధ్య కేసులకే అమ్మో అనుకునేవాళ్లం. కానీ ఇప్పుడు రోజూ వందల్లో కేసులు నమోదవుతున్నాయి. నంబర్ రోజు రోజుకూ పెరిగిపోతోంది. నిన్న తెలంగాణలో రికార్డు స్థాయిలో 499 కేసులు వెలుగు చూశాయి. దీనికే అందరూ షాకైపోయారు. ఐతే శనివారం కేసుల సంఖ్య ఇంకా పెరిగిపోయింది. తొలిసారిగా 500 మార్కు దాటింది. ప్రభుత్వం రిలీజ్ చేసిన తాజా బులిటెన్ ప్రకారం శనివారం 546 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.

శనివారం 3500కు పైగా టెస్టులు నిర్వహించగా.. ఏకంగా 1100 దాకా కొత్త కేసులు బయటపడ్డట్లుగా వార్తలొచ్చాయి. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన కోసం అంతా ఎదురు చూశారు. ఐతే ప్రభుత్వ బులిటెన్లో అందులో సగం కేసులే నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో 80 శాతం పైగా కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనే నమోదయ్యాయి. హైదరాబాద్‌లో దాదాపుగా ప్రతి ఏరియాలోనూ కరోనా కేసులున్నాయి. కాలనీలో అక్కడక్కడా ఉన్న కేసులు ప్రతి అపార్ట్‌మెంట్‌కూ విస్తరించే స్థాయికి వచ్చేశాయి. టెస్టులు చేస్తే దాదాపుగా ప్రతి వంద మీటర్లలోనూ పదుల సంఖ్యలో కేసులు ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం కరోనా కేసుల సంఖ్య 7 వేల మార్కును దాటగా.. 3500 మంది దాకా డిశ్చార్జ్ అయ్యారు. 3360 కేసుల దాకా యాక్టివ్‌గా ఉన్నాయి. రాష్ట్రంలో మరణాల సంఖ్య 200 మార్కును దాటింది. మొత్తం ఇప్పటిదాకా కరోనా వల్ల 203 మంది చనిపోయారు.