ఎవ‌రి పంచాంగం వాళ్ల‌దే!

ఉగాది అంటే ముందుగా గుర్తుకు వ‌చ్చేది ప‌చ్చ‌డి. ష‌డ్రుచుల క‌ల‌యిక‌తో జీవిత స‌త్యాన్ని తెలుపుతూ త‌యారు చేసి ఈ ప‌చ్చ‌డికి ఎంతో ప్రాముఖ్య‌త ఉంది. ఇక తెలుగు వాళ్ల కొత్త సంవ‌త్స‌రం రోజున జరిపే పంచాంగ శ్ర‌వ‌ణం గురించి ప్ర‌జ‌లు ఆస‌క్తిగా ఎదురు చూస్తారు. ఈ కొత్త ఏడాదితో త‌మ జాత‌కం ఎలా ఉండ‌బోతుంది.. పంచాగం ఎలా ఉందో తెలుసుకునేందుకు ఆరాట‌ప‌డ‌తారు. ఇక రాజ‌కీయ పార్టీలు కూడా త‌మ భ‌విష్య‌త్ పై ఆస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తాయి. కానీ ఇప్పుడు పంచాంగం అనేది ఒక్కో రాజ‌కీయ పార్టీకి ఒక్కో ర‌కంగా మారిపోయింది. ఆయా రాజకీయ పార్టీల మెప్పు పొందేందుకు పండితులు వాళ్ల‌కు న‌చ్చేలా పంచాంగం చెబుతున్నార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

కేసీఆర్‌కు తిరుగులేదు..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వ‌ర్యంలో ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉగాది వేడుక‌లు నిర్వహించారు. అందులో భాగంగా పంచాంగ శ్ర‌వ‌ణం చేశారు. కేసీఆర్‌కు తిరుగులేద‌ని, ఆయ‌న సాహ‌సోపేత‌మైన నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఆ పండితుడు చెప్పారు. ఈ కొత్త ఏడాది మ‌హిళా, ఉద్యోగ నామ సంవ‌త్సరంగా ఉండ‌బోతుంద‌న్నారు. ప్ర‌తిప‌క్షాలు ఒక్క‌టిగా క‌లిసినా కేసీఆర్‌ను ఏం చేయ‌లేవ‌ని ఆ పండితుడు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పారు.

అంత‌వ‌ర‌కూ బాగానే ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన పంచాంగ శ్ర‌వ‌ణంలో పురోహితుడు ఏం చెప్పారో చూద్దాం. ఈ ఏడాది టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి మ‌రింత విజృంభిస్తార‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇంకా ధైర్య సాహ‌సాలు ప్ర‌ద‌ర్శిస్తార‌ని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా కేంద్రంలో ఓ ముఖ్య నేత మ‌ర‌ణ‌వార్త వింటార‌ని ఆయ‌న చెప్ప‌డం సంచ‌లనంగా మారింది.

రాష్ట్ర ప్ర‌భుత్వానికి గుణ‌పాఠం..
ఇక తెలంగాణ‌లో బ‌లోపేతం దిశ‌గా సాగుతున్న బీజేపీకి అనుగుణంగా ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన పండ‌గ వేడుక‌లో పంచాంగ ప‌ఠ‌నం జ‌రిగింది. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల బ‌లం పెరిగింద‌ని రాష్ట్ర ప్రభుత్వం గుణ‌పాఠం నేర్చుకోక‌ తప్ప‌ద‌ని ఆ పండితుడు తెలిపారు. ఇది ప్ర‌జా సంగ్రామ సంవ‌త్స‌ర‌మ‌ని, ధ‌ర్మం విజ‌యం సాధిస్తుంద‌ని పేర్కొన్నారు. మోడీ మూడోసారి ప్ర‌ధాని అవుతార‌ని చెప్పారు. ఇక ఏపీలో మ‌రోసారి జ‌గ‌న్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తుంద‌ని అక్క‌డి పంచాంగ ప‌ఠ‌నంలో  చెప్పారు. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు గ‌డ్డు దశ త‌ప్ప‌ద‌ని వెల్ల‌డించారు. ఇలా పండితుల పంచాంగ శ్ర‌వ‌ణం ఆయా పార్టీల‌ను ఆక‌ట్టుకునేలా సాగింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.