మోడీకి ఎస‌రుపెట్ట‌నున్న కేజ్రీవాల్‌?

ప్రాంతీయ పార్టీగా మొద‌లై.. జాతీయ పార్టీగా ఎదిగే దిశ‌గా సాగుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మ‌రో రాష్ట్రంపై గురి పెట్టింది. ఢిల్లీలో వ‌రుస‌గా అధికారంలోకి వ‌చ్చిన ఆప్‌.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పంజాబ్‌లో ఘ‌న విజ‌యం సాధించి జోష్‌లో ఉంది. ప్ర‌స్తుతం దేశంలో  కాంగ్రెస్‌, బీజేపీ మిన‌హా ఒక‌టి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ ఆప్ మాత్ర‌మే. ఇప్పుడిదే జోరుతో పార్టీని క్ర‌మంగా విస్త‌రించే ప్ర‌య‌త్నాల‌ను ఆప్ అధినేత కేజ్రీవాల్ వేగ‌వంతం చేశారు. ఏకంగా ప్ర‌ధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌పైనే గురిపెట్టారు. ఈ ఏడాది చివ‌ర్లో ఆ రాష్ట్ర అసెంబ్లీకి జ‌రిగే ఎన్నిక‌ల్లో అధికార బీజేపీని ఓడించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు.

ఆ జోరుతో..
పంజాబ్‌లో సంచ‌ల‌నం విజ‌యం సాధించిన ఆప్ జోరుమీదుంది. ఇదే దూకుడుతో మిగ‌తా రాష్ట్రాల్లోనూ పార్టీని విస్త‌రించే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు సిద్ధ‌మ‌వుతుంది. ముందుగా ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌పై ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ దృష్టి సారించారు. అందులోనూ ప్ర‌ధాని సొంత రాష్ట్రమైన గుజ‌రాత్‌లో జెండా ఎగిరితే త‌మ‌కు తిరుగుండ‌ద‌ని ఆయ‌న ఆలోచ‌న‌గా తెలుస్తోంది. ఇప్ప‌టికే జాతీయ రాజ‌కీయాల్లో మోడీకి స‌రైన ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే శ‌క్తి కేజ్రీవాల్‌కు ఉంద‌ని ఆప్ పార్టీ నేత‌లు చెబుతున్నారు. రాజ‌కీయ విశ్లేష‌కులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అందుకే ముందుగా గుజ‌రాత్‌పై కేజ్రీవాల్ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టార‌ని తెలుస్తోంది.

అవినీతి ల‌క్ష్యంగా..
గుజ‌రాత్‌లో ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌లు ముందుగానే అక్క‌డ ప్ర‌చారానికి కేజ్రీవాల్ తెర‌తీశారు. తాజాగా అహ్మ‌దాబాద్‌లో తిరంగ గౌర‌వ్ యాత్ర పేరుతో ఆప్ నేత‌లు రోడ్డు షో నిర్వ‌హించారు. కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ గుజ‌రాత్ ఆప్ నేత‌లు పాల్గొన్నారు. 25 ఏళ్ల పాటు గుజ‌రాత్ ప్ర‌జ‌లు బీజేపీకి ప‌ట్టం క‌ట్టార‌ని ఇప్పుడా పార్టీ అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని కేజ్రీవాల్ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఇన్ని రోజులు బీజేపీకి అవ‌కాశమిచ్చిన ప్ర‌జ‌లు ఈ ఒక్క‌సారి ఆప్‌కు ఛాన్స్ ఇవ్వాలంటూ ఆయ‌న కోరారు. గుజ‌రాత్‌లో అధికారంలోకి వ‌స్తే అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తామ‌ని చెప్పారు. మ‌రోవైపు ఆ రాష్ట్ర ఆప్ నేత‌ల‌తో కేజ్రీవాల్ ప్ర‌త్యేకంగా స‌మావేశం కానున్నారు.

ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్రంలో పార్టీ వ్యూహాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలిసింది. గుజ‌రాత్ మోడ‌ల్ చూపించి దేశానికి ప్ర‌ధాని అయిన మోడీకి ఇప్పుడు ఢిల్లీ మోడ‌ల్ చూపించి చెక్ పెట్టాల‌ని కేజ్రీవాల్ చూస్తున్నారు. అందుకే గుజ‌రాత్‌లో మొత్తం 182 స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యించింది. గ‌త ఏడాది మార్చిలో జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆప్ మంచి ప్ర‌ద‌ర్శ‌నే చేసింది. 42 స్థానాలు గెలుచుకుంది. తాలూకా పంచాయితీల‌లో 31 సీట్లు, మున్సిపాలిటీలో 9 సీట్లు, రెండు జిల్లా పంచాయ‌తీ స్థానాల‌ను ఆప్ ద‌క్కించుకుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌లపై ఫోక‌స్ పెట్టింది.