ప్రజలకు జగన్ సర్కారు విన్నపం !

ఏపీలోని జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనూహ్య నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విచ్చ‌ల‌విడిగా.. డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తూ.. సంక్షేమం పేరిట పందేరం చేసిన‌.. ప్ర‌భుత్వానికి అనూహ్యంగా `పొదుపు` గుర్తుకు వ‌చ్చింది. అంతేకాదు.. ప్ర‌జ‌ల‌కు ఇస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను కూడా వాయిదా వేస్తున్న ప్ర‌భుత్వం తాజాగా.. ప్ర‌జ‌లే పొదుపు పాటించాలంటూ.. పిలుపునిచ్చింది. దీనికి కార‌ణం.. విద్యుత్ డిమాండ్‌కు స‌ర‌ఫ‌రాకు, డిమాండ్‌కు మ‌ధ్య భారీ వ్య‌త్యాసం రావ‌డంతో స‌ర్కారు తాజాగా ప్ర‌జ‌ల‌కు ఒక బ‌హిరంగ లేఖ రాసింది. విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల‌ని.. అభ్య‌ర్థించింది.

వేసవిలో విద్యుత్ వినియోగం పెరుగుతున్నందున వినియోగదారులు విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఎస్.ఈ. కె.వి.జి.సత్యనారాయణ అన్నారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ లో ఆయ‌న‌ మాట్లాడుతూ, వేసవి ఎండలు పెరుగుతున్న దృష్ట్యా విద్యుత్ వినియోగం పెరిగిందని, అలాగే, వ్యవసాయ వినియోగం కూడా పెరిగిందని వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల వినియోగదారులు విద్యుత్ ను పొదుపుగా వినియోగించాలని కోరారు.

వ్యవసాయ సీజన్ 20 రోజులలో ముగుస్తుందని అప్పుడు కొంత వెసులుబాటు ఉంటుందన్నారు. రాష్ట్రం మొత్తంలో 4 కోట్ల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నారని ఇందులో 2 కోట్ల మందిపైగా మంది గృహ వినియోగదారులు ఉన్నారని, అదేవిధంగా 50 లక్షల మంది వ్యవసాయ వినియోగదారులు, లక్ష‌ మంది భారీ పరిశ్రమల వినియోగదారులు ఉన్నారని చెప్పారు. ప్రస్తుతం ఒక్కొక్క జిల్లాలో విద్యుత్ వినియోగం 10.879 మిలియన్ యూనిట్ల నుంచి 11.284 మిలియన్ యూనిట్లకు పెరిగిందన్నారు.

పరిశ్రమల వారిని పీక్ అవర్స్ లో విద్యుత్ వినియోగించవద్దని సూచిస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. వాణిజ్య వినియోగదారులు కూడా స్టార్ రేటింగ్ ఉన్న ఏసీలు, ఇతర విద్యుత్ ఉపకరణాలు వినియోగించి విద్యుత్ పొదుపునకు సహకరించాలన్నారు. మొత్తానికి ఈ ప్ర‌క‌ట‌న చూస్తే.. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం పొంచి ఉంద‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. గ‌త కొన్నాళ్లుగా విద్యుత్ సంక్షోభంపై వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే. .ప్ర‌భుత్వం మాత్రం చాలినంత విద్యుత్ ఉంద‌ని ప్ర‌క‌టిస్తూ.. వ‌స్తోంది. మ‌రి అలాంట‌ప్పుడు.. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు ఎందుకు ఇచ్చిన‌ట్టు? అనేది మేధావుల ప్ర‌శ్న‌. ఏదేమైనా.. ప్ర‌స్తుత నిర్ణ‌యం ముందు రాబోయే సంక్షోభాన్ని సూచిస్తోంద‌ని అంటున్నారు.