జగన్ ను ఫాలో అవుతున్న లోకేశ్..?

పోయిన చోటే వెతుక్కోవాలన్న పెద్దల మాటను తూచా తప్పకుండా ఫాలో అయినట్లుగా కనిపిస్తోంది చంద్రబాబు కుమారుడు కమ్ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీరు చూస్తుంటే. లాక్ డౌన్ సమయాన్ని పూర్తిస్థాయిలో వాడేసుకున్న లోకేశ్ .. తనను తాను మేకోవర్ చేసుకున్నారు. బొద్దుగా ఉండే ఆయన తన బాహ్యా రూపాన్ని మాత్రమే కాదు.. భాషను.. ఉచ్ఛారణను మార్చేసుకున్నారు. గతంలో మాదిరి మాటల కోసం తడుముకోవటం కాకుండా.. పక్కాగా ప్రిపేర్ అయి వస్తున్నట్లుగా ఆయన మాటలు చెప్పేస్తున్నాయి.

ఎన్నికల్లో ఓటమి కంటే కూడా.. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పరిణామాలు ఆయన్ను తీవ్రంగా ప్రభావితం చేశాయన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. జగన్ వ్యవహరిస్తున్న తీరు బాబు అండ్ కో ఏ మాత్రం అంచనా వేయలేదన్న అభిప్రాయం ఉంది. తనను తాను మార్చుకోకుంటే.. పార్టీ మొత్తంగా కుప్పకూలే పరిస్థితి వస్తుందన్న భావనతో పాటు.. ఇప్పుడు కాకుంటే మరెప్పటికీ సాధ్యం కాదన్న వాస్తవాన్ని లోకేశ్ గుర్తించినట్లుగా చెప్పాలి.

దీనికి తోడు.. విపక్ష నేతగా ఉన్న వేళలో జగన్ ఏమేం చేశారు? ఏ పరిస్థితుల్లో ఎలా వ్యవహరించారు? ఎప్పుడు ఎలా మాట్లాడేవారు? ఆయన ఎత్తులు ఎలా ఉండేవి? లాంటి అంశాల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లుగా తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన తీరులో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా అనంతపురం జిల్లా తాడిపత్రికి వెళ్లి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాన్ని పలుకరించిన సందర్భంగా తన తీరుకు భిన్నంగా లోకేశ్ రియాక్షన్ ఉందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

2017లో విశాఖ ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న జగన్ ను అప్పట్లో పోలీసులు అడ్డుకోవటం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంకా రెండే రెండేళ్లు ఉందని.. అందరిని గుర్తు పెట్టుకుంటాను.. ఎవ్వరినీ మర్చిపోనంటూ ఆవేశం ప్లస్ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. సరిగ్గా ఆ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చేలా లోకేశ్ తాజా వ్యాఖ్యలు ఉండటం గమనార్హం.

జేసీ బ్రదర్స్ కుటుంబాల్ని పరామర్శించిన సందర్భంలో మాట్లాడిన లోకేశ్.. అన్నింటినీ రాసుకుంటున్నాం. వడ్డీతో సహా చెల్లిస్తామన్న వార్నింగ్ మాత్రమే కాదు.. ఫైబర్ గ్రిడ్ కుసంబంధించిన సెట్ టాప్ బాక్సుల్లో అవినీతి జరిగిందన్న దాన్లో నిజం లేదని.. ఏం పీకలేరంటూ ఫైర్ అయ్యారు. నిజానికి ఇలాంటివన్నీ లోకేశ్ కు సహజ సిద్ధంగా వచ్చిన లక్షణాలు కావు. లాక్ డౌన్ సమయంలో ఇరవై కేజీల బరువు తగ్గటంతో పాటు.. తనను తాను ఎంత మార్చుకున్నానన్న విషయాన్ని తన మాటలతో.. చేతలతో చెప్పేస్తున్నారు. ఇదంతా చూస్తున్నప్పుడు.. జగన్ ఏ తీరులో అయితే దూకుడుగా వ్యవహరించి దెబ్బ తీశారో.. ఇప్పుడు అదే తీరును లోకేశ్ వంట బట్టించుకున్నట్లుగా కనిపిస్తోంది.