మోడీ సార్‌కు ఆ జ‌బ్బు మంచిది కాదు:  ప్ర‌కాశ్ రాజ్‌

బ‌హుభాషా నటుడు ప్రకాశ్‌ రాజ్ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న కేంద్రంలోని బీజేపీని, ముఖ్యంగా ప్ర‌దాని మోడీని తీవ్ర‌స్థాయిలో టార్గెట్ చేస్తూ.. జాతీయ‌స్థాయి రాజ‌కీయాల్లో.. విమ‌ర్శ‌కుడిగా నిలిచారు. అనేక అంశాల‌పై ఆయ‌న స్పందించారు. రాజ‌కీయ అస‌హనం, మ‌త అస‌హ‌నం, తాజాగా క‌ర్ణాట‌క‌లో వెలుగు చూసిన‌.. హిజాబ్ అంశం.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌లు ఇలా, అనేక అంశాల‌పై మోడీపై.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

తాజాగా ఇప్పుడు కూడా మ‌రోసారి మోడీని టార్గెట్ చేస్తూ.. ప్ర‌కాశ్ చేసిన వ్యాఖ్య‌లు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ప్ర‌కాశ్ రాజ్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ సోషల్‌ మీడియా వేదికగా వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు.

ఓ సమావేశంలో చంద్రకాంత్ పాటిల్‌ ప్రధాని మోడీ రెండు గంటలే నిద్రపోతారని, ఒక రోజులో 22 గంటల పాటు ఆయన పనిచేస్తుంటారని అన్నారు. అంతేకాదు… దేశానికి సేవ చేయ‌డం కోస‌మే.. మోడీ జ‌న్మించార‌ని.. ప్ర‌స్తుతించారు. ఆయ‌న సార‌ధ్యంలోనే దేశం ముందుకు సాగుతోంద‌న్నారు.. అయితే.. ఈ వ్యాఖ్యలపై ప్రకాశ్‌ రాజ్‌ సెటైరికల్‌గా స్పందించాడు.

‘దయచేసి కొంచెం కామన్సెన్స్ ఉపయోగించండి. నిద్రపోలేకపోవడం అనేది ఓ జబ్బు. వైద్య పరిభాషలో దీన్ని ఇన్సోమ్నియా అంటారు. దాని గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు. ఆ జబ్బుతో బాధపడుతున్న మీ నాయకుడికి చికిత్స అందించండి’ అంటూ ప్ర‌కాశ్ రాజ్ త‌న‌దైన శైలిలో ట్విట్ట‌ర్‌లో రాసుకొచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ప్ర‌కాశ్‌రాజ్‌కు అనుకూలంగా ఎక్కువ మంది.. ఈ ట్విట్ ను లైక్ చేయ‌డం గ‌మ‌నార్హం.  అంతేకాదు.. చాలామంది రీట్వీట్ కూడా చేశారు. తాము కూడా ప్ర‌కాశ్‌రాజ్‌తో ఏకీభ‌విస్తున్నామ‌న్నారు.