పోలవరం ఆగిందా ? కారణం ఇదే !

పోల‌వ‌రం నిర్మాణం పూర్తి అన్న‌ది త‌మ‌తోనే సాధ్యం అని వైసీపీ చెబుతోంది. కానీ క్షేత్ర స్థాయిలో ఉన్న వాస్త‌వాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇసుక త‌ర‌లింపున‌కు సంబంధించి రెండు పెద్ద కంపెనీల మ‌ధ్య రగులుతున్న ర‌గ‌డ‌ను నివారించే, నిలువ‌రించే ప్ర‌య‌త్నం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మాత్ర‌మే చేయ‌గ‌ల‌రు. ఇదే ద‌శ‌లో కేంద్రం నుంచి వ‌చ్చే నిధులు త‌రువాత ప‌నులు వీటిపై కూడా జ‌గ‌న్ ఒక్క‌రే తేల్చ‌గ‌ల‌రు.కానీ ఆగిపోయిన ప‌నుల ఊసెత్తితే వైసీపీ త‌మ‌ను ఎందుకు బూతులు తిడుతోంద‌ని టీడీపీ ప్ర‌తినిధులు ఆవేద‌న చెందుతున్నారు.

త‌మ హ‌యాంలో 70శాతంకు పైగా పూర్తయిన ప‌నులు వాటి నాణ్య‌త వీటిపై ఏ చ‌ర్చకు అయినా తాము సిద్ధ‌మేన‌ని కానీ వైసీపీ మాత్రం స‌హేతుక సంబంధ చ‌ర్చ‌కు రాకుండా..అనాలోచిత ధోర‌ణిలో ఏక ప‌క్ష విధానాల‌కు ప్రాధాన్యం ఇస్తూ..అవ‌మాన‌క‌ర రీతిలో భాష ఉప‌యోగిస్తుంద‌ని నాటి ఇరిగేష‌న్ మినిస్ట‌ర్ దేవినేని ఉమ సైతం అంటున్నారు. నిన్న‌టి వేళ అసెంబ్లీ వేదిక‌గా పోల‌వ‌రం  నిర్మాణానికి సంబంధించి స్ప‌ష్ట‌మ‌యిన ప్ర‌క‌ట‌న ఒక‌టి చేశారు జ‌గ‌న్. ఇదే స‌మ‌యంలో మీడియా పెద్ద‌లు రామోజీని, రాధాకృష్ణ ను ఉద్దేశించి  కొన్ని వ్యంగ్య వ్యాఖ్యానాలు కూడా చేశారు.

సెటైరిక‌ల్ మోడ్ లో మాట్లాడుతూనే పోల‌వ‌రం ఎత్తు ఒక్క ఇంచి కూడా త‌గ్గించం అని తేల్చేశారు. వ‌చ్చే ఖ‌రీఫ్ నాటికి పోల‌వ‌రం నీళ్ల‌తో పొలాల‌న్నీ స‌స్య‌శ్యామ‌లం అవుతాయ‌ని చెప్పారు జ‌గ‌న్. ఆయ‌న మాట‌లు ఎలా ఉన్నా క్షేత్ర స్థాయిలో ఉన్న ఓ త‌గాదా రోజురోజుకూ తీవ్ర‌త‌రం అవుతోంది. ముఖ్యంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు చేప‌డుతున్న మేఘ కంపెనీకి అక్క‌డే గోదావ‌రి తీరాల‌లో ఇసుకను త‌ర‌లించుకుని వెళ్లే జేపీ వెంచ‌ర్స్ కు మ‌ధ్య త‌గాదా నెల‌కొనడంతో పోల‌వ‌రం ప‌నులు నిన్న‌టి మ‌ధ్యాహ్నం వేళ ఆగిపోయాయ‌ని స్ప‌ష్ట‌మ‌యిన స‌మాచారం ఒక‌టి ప్ర‌ధాన మీడియా వెల్ల‌డించింది.

రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్ ల‌న్నింటినీ జేపీ వెంచ‌ర్స్ ద‌క్కించుకోవ‌డంతో ఇక్క‌డ ప్రాజెక్టు నిర్మాణానికి అవ‌స‌రం అయిన ఇసుక‌ను వాడుకునేందుకు సంబంధిత సంఘ మేఘాకు అడ్డం చెబుతూ, వార్న్ చేస్తోంది. అయితే పోల‌వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అవ‌స‌రం అయిన ఇసుక స‌మీప గోదావ‌రి తీరం నుంచి తీసుకునేందుకు ప్ర‌భుత్వం త‌మ‌కు అన్ని అనుమతులూ ఇచ్చింద‌ని మేఘా కంపెనీ చెప్పిన కూడా జేపీ వెంచ‌ర్స్ సంస్థ ప్ర‌తినిధులు వినిపించుకోవ‌డం లేద‌ని ప్ర‌ధాన మీడియా వెల్ల‌డిస్తోంది. పోల‌వ‌రం నిర్మాణానికి కోటి క్యూబిక్ మీట‌ర్ల ఇసుక కావాల‌ని అయితే జేపీ వెంచ‌ర్స్ అడ్డుకోవ‌డంతో ప‌నులు ఆగిపోయాయ‌ని దీంతో ప్రాజెక్టుకు సంబంధించి డ‌యాఫ్రం వాల్ ప‌నులను నిలిపివేశామ‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డిస్తున్నారు అని నిన్న‌టి వేళ ప్ర‌ధాన మీడియాలో ఓ వార్తా క‌థ‌నం సంచ‌ల‌నం రేపింది. ఓ వైపు ముఖ్యమంత్రి స‌భ‌ను ఉద్దేశించి పోల‌వ‌రం ప్రాజెక్టుపై క్లారిఫికేష‌న్ ఇస్తుండ‌గానే మ‌రో వైపు క్షేత్ర స్థాయిలో ప‌రిణామాలు అందుకు భిన్నంగా ఉండ‌డంతో వైసీపీలో క‌ల‌వ‌రపాటు మొద‌లైంది.