కేంద్రానికి తెలంగాణ ఉద్య‌మం ఎలా ఉంటుందో చూపిస్తా

కేంద్ర ప్ర‌భుత్వంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోసారి నిప్పులు చెరిగారు. కేంద్రానికి తెలంగాణ ఉద్య‌మం ఎలా ఉంటుందో రుచి చూపిస్తామ‌న్నారు. దీనికి కార‌ణం.. ధాన్యం. కేంద్రం ధాన్యం సేకరణపై అంగీకరించకపోతే తెలంగాణ ఉద్యమ పంథాలో పోరాడుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. మంగ‌ళ‌వారం మంత్రులు, ఎంపీల బృందం కేంద్రమంత్రిని కలుస్తారని… అక్కడ సానుకూల స్పందన రాకుంటే… పెద్దఎత్తున ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేపడతామని ప్రకటించారు. కేంద్రం ధాన్యం సేకరించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఆషామాషీగా కాకుండా కార్యాచరణ మేరకు పోరాటం ఉంటుందన్నారు. పంచాయతీల తీర్మానాలను కూడా కేంద్రానికి పంపుతామన్నారు. మండల, జిల్లా పరిషత్‌ల తీర్మానాలు కేంద్రానికి పంపుతామన్న సీఎం.. మున్సిపాలిటీలు, మార్కెట్‌ కమిటీల తీర్మానాలు కూడా పంపుతామన్నారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రం సేకరించాలని టీఆర్ఎస్ఎల్పీ భేటీలో తీర్మానం చేసినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. పంజాబ్‌ తరహాలో కేంద్రం ధాన్యాన్ని సేకరించాలని తీర్మానం చేశామని సీఎం పేర్కొన్నారు. రేపు మంత్రులు, ఎంపీల బృందం దిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలుస్తారని ఆయన స్పష్టం చేశారు.

రాష్ట్ర రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం సేకరించాలన్నారు. ఎక్కువ పంట వస్తే ప్రాసెస్‌ చేసి నష్టం వస్తే కేంద్రమే భరించాలని ముఖ్యమంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకే విధానమైన ధాన్యం సేకరణ విధానం ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. ‘వన్‌ నేషన్‌-వన్‌ రేషన్‌’ అని చెబుతున్న కేంద్రం… ధాన్యం సేకరణలో ‘వన్‌ నేషన్‌-వన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ‘ పద్ధతిని అవలంభించాలని స్పష్టం చేశారు. ఈసారి యాసంగిలో 35 లక్షల ఎకరాల్లో ధాన్యం వస్తుందన్న కేసీఆర్‌…. పంట మార్పిడి కింద దాదాపు 25 లక్షల ఎకరాలు తగ్గిందని తెలిపారు. పంజాబ్‌లో ఎలా సేకరిస్తున్నారో అదే నీతిని తెలంగాణలోనూ అమలుచేయాలని డిమాండ్‌ చేశారు.

“ఆహార ధాన్య సేకరణలో దేశమంతా ఒకే విధానం ఉండాలి. ఆహార ధాన్య సేకరణలో ‘ఒకే దేశం-ఒకే సేకరణ’ విధానం ఉండాలి. ధాన్యం సేకరణలో గతంలోనూ కేంద్రం ఇబ్బందులు సృష్టించింది. యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలి. కనీస మద్దతు ధర బియ్యానికి కాదు.. ధాన్యానికి నిర్ణయిస్తారు. కనీస మద్దతు ధర ప్రకారమే పంజాబ్‌లో ధాన్యం సేకరిస్తున్నారు. కనీస మద్దతు ధర ప్రకారమే తెలంగాణ ధాన్యం తీసుకోవాలి. బాయిల్డ్‌ రైస్‌ మాత్రమే ఇవ్వాలని కేంద్రం చెబుతోంది. ధాన్యం ఇస్తే రా రైస్‌ చేస్తారా? బాయిల్డ్‌ రైస్‌ చేస్తారా? అనేది కేంద్రం నిర్ణయం“ అని కేసీఆర్ అన్నారు. మ‌రి కేంద్రం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.