బీజేపీని ఎవరైనా నమ్ముతారా? 

కడపలో నిర్వహించిన రణభేరి సభ తర్వాత జనాల్లో మళ్ళీ ఇదే చర్చ మొదలైంది. అధికార వైసీపీపై బీజేపీ నేతలు చాలా ఆరోపణలు చేశారు. బహిరంగసభ అన్నాక కచ్చితంగా అధికారపార్టీ పైన ఆరోపణలు, విమర్శలు చేస్తారని అందరికీ తెలిసిందే. కాబట్టి రాజకీయంగా చేసుకునే ఆరోపణలు-ప్రత్యారోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా తాను చేయాల్సిందేమీ చేయకుండానే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే. 

విభజన హామీలను తుంగలో తొక్కిందే నరేంద్ర మోడీ ప్రభుత్వమని అందరికీ తెలిసిందే. అధికారంలోకి రాకముందు ఒకలాగ మాట్లాడి ఆ తర్వాత దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కేంద్రంపై జనాలంతా మండుతున్నారు. ఇదే విషయాన్ని జనాలు కేంద్రాన్ని ఎన్నిసార్లు ప్రశ్నించినా ఇంతవరకు కమలనాథులు సమాధానమివ్వలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం ఎంత మొండిగా ముందుకెళుతోందో అందరు చూస్తున్నదే. 

స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించద్దని ఎంత గోల జరుగుతున్నా మోడి పట్టించుకోవటంలేదు. ఇక పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా రాష్ట్రాన్ని ఎంతగా సతాయిస్తోందో అందరు చూస్తున్నదే. విభజన చట్టాన్ని అడ్డంపెట్టుకుని తెలంగాణా ప్రభుత్వం ఏపీకి ఎంత అన్యాయం చేస్తున్నా జోక్యం చేసుకోవటానికి కేంద్రం ఇష్టపడటంలేదు. ఒకవైపు ఏపీకి అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం జోక్యం చేసుకోవడం లేదు. 

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికలో మోడీ సర్కార్ ఏపీకి ఏదో న్యాయం చేస్తుందని నమ్మి జనాలు అప్పుడు ఓట్లేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ వైఖరి చూసిన జనాలు పార్టీకి బాగానే వాతలు పెడుతున్నారు. ఏ ఎన్నికలోను బీజేపీకి ఓట్లేయటంలేదు. పంచాయతీ ఎన్నికల నుండి పార్లమెంటు ఎన్నికలవరకు ఏది తీసుకున్నా కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వటం లేదు. కాబట్టి పార్టీకి నాలుగు సీట్లు రావాలంటే ముందు ఏపీ అభివృద్ధికి తాను చేయాల్సింది చేయాలి. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేసినా విమర్శించినా జనాలు ఆమోదిస్తారు. అప్పటి వరకు ఎన్ని రణభేరిలు పెట్టుకున్నా జనాల కర్ణభేరి దెబ్బతినటం తప్ప పార్టీకి ఏమీ ఉపయోగముండదు.