కాంగ్రెస్‌.. ఇక మూసేసుకోవ‌డ‌మే

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బిక్క‌చ‌చ్చిపోయిన కాంగ్రెస్‌కు జ‌వ‌స‌త్వాలు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం.. విశ్వ‌ప్ర‌యత్నాలు చేస్తున్న స‌మ‌యంలో కీల‌క నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు.. కీల‌క రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న ఘ‌ర్ష‌ణ‌లు ఆ పార్టీ ఉసురు తీసేస్తున్నాయి. అదేస‌మ‌యంలో ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఆయుధాల‌ను అందిస్తున్నాయని అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా కాంగ్రెస్‌ను ప‌ట్టాలెక్కించే కార్య‌క్ర‌మానికి పార్టీ అధిష్టానం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతోంది. అయితే.. పా ర్టీ జాతీయ నేత‌లు.. మాత్రం .. కాంగ్రెస్‌పైనే తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. అదేస‌మ‌యంలో తెలంగాణ వంటి రాష్ట్రాల్లోనూ పార్టీ నేత‌లు రోడ్డున ప‌డుతున్నారు.

ప్రజలను కులం, మతం వంటి పలు అంశాల ఆధారంగా విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయని, అందులో కాంగ్రెస్‌ పార్టీ సైతం ఉందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమానికి పాకిస్తాన్, ఉగ్రవాదులే కారణమని నొక్కిచెప్పారు. వివిధ అంశాల ఆధారంగా ప్రజలను కాంగ్రెస్ సహా అన్ని రాజకీయ పార్టీలు విభజిస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 1990లో కశ్మీర్ పండిట్లపై జరిగిన మారణహోమాన్ని సూచిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ లోయలో పండిట్లపై జరిగిన ఘటనలకు పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణమని పేర్కొన్నారు.

జమ్మూలో తాజాగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడారు ఆజాద్. సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ చిత్రంపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. కులం, మతం సహా ఇతర అంశాల ఆధారంగా 24×7 ప్రజలను విభజించటంలో రాజకీయ పార్టీలు నిమగ్నమయ్యాయన్నారు. “నా సొంత పార్టీతో (కాంగ్రెస్) పాటు ఏ పార్టీని విస్మరించటం లేదు.“ అని తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ విషయంలో వ్యక్తిగతంగా ఏ పార్టీని క్షమించనన‌ని అన్నారు. పౌర సమాజం ఎప్పుడూ ఐక్యంగా ఉండాలన్నారు. కులం, మతం చూడకుండా అందరికి సమానంగా న్యాయం అందాల‌న్నారు.

“మహాత్మాగాంధీ అతిపెద్ద హిందువు, లౌకికవాది. జమ్ముకశ్మీర్లో 1990లో జరిగిన దానికి పాకిస్థాన్, ఉగ్రవాదులే కారణం. దాని ద్వారా హిందువులు, ముస్లింలు, డోగ్రాలు, కశ్మీర్ పండిట్ వర్గాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి“ అన్న ఆజాద్‌.. ఇదే స‌మ‌యంలో కాంగ్రెస్‌ప ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో .. ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి బీజేపీకి ఆయ‌న స్వ‌యంగా అస్త్రాలు అందించార‌ని .. అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రో వైపు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి ఏమంత బాగాలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీని మూసేయ‌డ‌మే మెరుగా! అనే చ‌ర్చ తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.