పవన్‌కు నేషనల్ ఎలివేషన్

దక్షిణాది ఎంత పెద్ద రాజకీయ పరిణామాలు నార్త్ ఇండియన్స్ పెద్దగా పట్టించుకోరు. నేషనల్ మీడియా కూడా సౌత్ వ్యవహారాలపై శీత కన్నేస్తూ ఉంటుంది. ఇక్కడి నాయకులు పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చినా వాటికి మీడియాలో ప్రాధాన్యం దక్కదు. సోషల్ మీడియాలోనూ లోకల్‌ జనాలు చర్చలు పెట్టడమే తప్ప.. ఉత్తరాది వాళ్లు మన టాపిక్స్ మాట్లాడటం తక్కువే. అలాంటిది ఇప్పుడు జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఒక కామెంట్ ఉత్తరాది జనాల దృష్టిని ఆకర్షించింది.

అక్కడి ప్రముఖులు తన ప్రసంగం తాలూకు వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. పవన్ కామెంట్ సూపర్ అని పొగిడేస్తున్నారు. పవన్‌ను దమ్మున్న నాయకుడిగా అభివర్ణిస్తున్నారు. జనసేనాని మాటల్ని అందరూ సీరియస్‌గా తీసుకోవాలని, మద్దతుగా నిలవాలని, ఆయన మాటలకు అనుగుణంగా ఉద్యమం చేయాలని పిలుపునిస్తున్నారు.

ఇంతకీ ఉత్తరాది జనాల్ని ఆకర్షించిన పవన్ మాట ఏంటంటే.. క్రిస్టియన్ చర్చిలు, ముస్లిం మసీదులపై లేని ప్రభుత్వ పెత్తనం హిందూ దేవాలయాలపై ఎందుకు? అన్ని మతాలనూ ఒకేలా చూడాలి, మతానికో న్యాయమా అని ప్రశ్నిస్తూ.. దేవాలయాలపై ప్రభుత్వ అజమాయిషీని తప్పుబట్టాడు పవన్. ప్రభుత్వ ప్రమేయం లేకుండా దేవాలయాలు స్వతంత్రంగా ఉండాలన్నట్లు పవన్ మాట్లాడాడు. ఈ డిమాండ్ ఈనాటిది కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. దేవాలయాల ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకోవడం, వాటి నిర్వహణ బాధ్యతను అధికారుల చేతుల్లో పెట్టడాన్ని చాలామంది తప్పుబడుతుంటారు. చర్చిలు, మసీదులను స్వేచ్ఛగా విడిచిపెట్టి ఆలయాలపై ఈ పెత్తనం ఏంటని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు పవన్ ఇదే ప్రశ్న లేవనెత్తాడు.

భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు, హిందుత్వ వాదులు ఇప్పుడీ పాయింట్‌ను హైలైట్ చేస్తున్నాడు. పవన్ స్పీచ్‌ను షేర్ చేస్తూ దీనిపై ఉద్యమం రావాలని, అందరూ మద్దతుగా నిలవాలని డిమాండ్ చేస్తున్నారు. దీని వెనుక పొలిటికల్ ప్రాపగండా కూడా ఉండొచ్చు కానీ.. ఎలాగైతేనేం పవన్‌కు నేషనల్ లెవెల్లో ఎలివేషన్ వస్తున్నందుకు అభిమానులు సంతోషిస్తున్నారు.