టీఢీపీ: హ‌మ్మ‌య్య ! టాప్ క్లాస్ టాపిక్ దొరికిందోచ్ !

చాలా రోజుల‌కు టీడీపీకి టాప్ క్లాస్ టాపిక్ ఒక‌టి దొరికింది.అదే జంగారెడ్డి గూడెం (ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా) సారా మ‌ర‌ణాలు.దీనిపై నారా లోకేశ్ మొదలుకుని మిగ‌తా నాయ‌కులంతా అదే ప‌నిగా మాట్లాడుతున్నారు.నిన్న‌టివేళ లోకేశ్ ఇంకాస్త గొంతు కూడా పెంచారు.పార్ల‌మెంట్ వేదిక‌గా కూడా టీడీపీ స‌భ్యులు ఇదే విష‌యాన్న ప్రస్తావించారు. యువ ఎంపీ కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డారు. త‌మ ప్ర‌భుత్వం ఆ రోజు న‌డుచుకున్న తీరు ఇప్ప‌టి ప్ర‌భుత్వం న‌డుచుకుంటున్న తీరు బేరీజు వేయాల‌ని కోరుతూ లోకేశ్ ప‌దే ప‌దే మీడియా ముంద‌ట ప్ర‌క‌ట‌నలు ఇస్తున్నారు.అయితే లోకేశ్ క‌న్నా ఎంపీ రామూ నే హుందాగా మాట్లాడుతున్నారు. విష‌య వివేచ‌న కూడా చేయ‌గ‌లుగుతున్నారు.

ఇదే సంద‌ర్భంలో టీడీపీ కి చెందిన ఇత‌ర నాయ‌కులు కూడా ఇష్యూని ఇంకాస్త హైలెట్ చేసేందుకు ప్ర‌య‌త్నించండం కేవ‌లం రాజ‌కీయంలో భాగ‌మే అయినా కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం దొర‌కాలంటే ఆ పాటి హ‌డావుడి చేయ‌క త‌ప్ప‌దు అన్న‌ది ప‌రిశీల‌కుల మాట.

“కల్తీ సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జే బ్రాండ్ లిక్కర్ వలన వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 28 ప్రాణాలు బలిగొన్న కల్తీ సారా, జే బ్రాండ్స్ లిక్కర్ పై అసెంబ్లీ లో చర్చ చేపట్టాలని ప‌ట్టుబడుతూ శాసనసభ సభ్యులు,శాసన మండలి సభ్యులు కలిసి నిరసన తెలిపాం.అసెంబ్లీలో మా పార్టీ పోరాటం ఫ‌లితంగానే ప్రభుత్వ యంత్రాంగం ఆఘ‌మేఘాలపై స్పందించి సారా స్థావరాలపై దాడులు మొదలుపెట్టింది..” అంటూ నారా లోకేశ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు.

ఇదే విధంగా యువ ఎంపీ రాము కూడా పార్లమెంట్ లో జ‌గ‌న్ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను అదేవిధంగా జంగారెడ్డిగూడెంలో జ‌రిగిన విషాద మ‌ర‌ణాల‌ను కూలంకుషంగా వివ‌రించారు. అయితే టీడీపీ నాటు సారాకు వ్య‌తిరేకంగా ఉద్య‌మించ‌గ‌ల‌దా? అన్న‌దే సందేహం. ఎందుకంటే ఆ రోజు బాబు హ‌యాంలో కూడా నాటు సారా ఉంది.. అప్పుడు కూడా పోలీసు వైఫ‌ల్యం ఉంది. క‌నుక కేవ‌లం ఈ మ‌ర‌ణాల వ‌ర‌కే బాబు మాట్లాడి రాజ‌కీయంగా ఎద‌గాల‌నుకోవ‌డం అన్న‌ది ఏమంత స‌భ్య‌త కాద‌ని వైసీపీ అంటోంది. అవి స‌హ‌జ మ‌ర‌ణాలే అని ప‌దే ప‌దే అంటోంది వైసీపీ. అయితే ఈ ఒక్క త‌ప్పు త‌ప్ప వైసీపీ మ‌రోమాట కూడా పెద్ద‌గా చెప్ప‌లేక‌పోతోంది. తాము నియంత్రించినా కూడా నాటు సారా ప్ర‌వాహాలు క‌ట్ట‌డి కి నోచుకోలేవు అని వైసీపీ చెబితే బాగుంటుంద‌ని టీడీపీ వ్యంగ్య రూపంలో స్పందిస్తుంది.

ఇదే విధంగా ఈ విష‌యాన్ని మ‌రో నెల రోజులు కొన‌సాగించినా ఆశ్చ‌ర్య పోన‌వ‌స‌రం లేదు. అంతేకానీ ప్ర‌జా ప్ర‌యోజ‌నం దృష్ట్యా రేప‌టి వేళ తాము మ‌ద్య‌పాన నిషేధం తీసుకు వ‌స్తామ‌ని మాత్రం బాబు కానీ జ‌గ‌న్ కానీ ఇంకా ఏ పార్టీ నేత గానీ చెప్ప‌క‌పోవ‌డ‌మే మ‌ర‌ణ కాల విషాదం చెంత న‌మోదు అవుతున్న మ‌రో విషాదం.