రాష్ట్రంలోని  ప్రతి ఎమ్మెల్యేకూ రూ.2 కోట్లు

ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి కింద ఇస్తున్న‌ట్టు సీఎం జ‌గ‌న్ చెప్పారు. ఏప్రిల్‌ 1 నుంచి ఖాతాల్లో ఆ ఎమౌంట్ ప‌డుతుంద‌ని తెలిపారు. ఈ మేర‌కు వైసీపీ శాస‌న‌స‌భా ప‌క్షం స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. రెండు కోట్ల రూపాయ‌ల నిధుల‌ను వాడుకునే స్వేచ్ఛ క‌ల్పిస్తున్నామ‌న్నారు. “మీరు గ్రామాలకు వెళ్లినప్పుడు మరో రెండు మూడు ముఖ్యమైన అంశాలున్నాయి.  ప్రతి గ్రామంలో మన ప్రతినిధులు ఉన్నారు. సర్పంచులు, వార్డు మెంబర్లు, బూత్‌కమిటీలు.., ఎంపీటీసీలు… వీరంతా ఉన్నారు. వీరందరికీ మంచి శిక్షణ అవసరం. ఈ నిధుల‌ను వినియోగించి అవ‌స‌ర‌మైతే వారికి శిక్ష‌ణ ఇవ్వండి“ అని సూచించారు.

టీడీపీ అస‌త్యాల‌ను తిప్పికొట్టండి!

తెలుగుదేశం చేస్తున్న అసత్య ప్రచారాలకు, ఆరోపణలకు గ్రామస్ధాయిలో సమర్ధవంతంగా తిప్పికొట్టాలని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సీఎం జ‌గ‌న్ సూచించారు.  అలా జరగాలంటే వీరందరికీ  డైనమిక్‌గా ట్రైనింగ్‌ ఇవ్వాలన్నారు. టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు వెంటనే కౌంటర్‌ ఇస్తారని తెలిపారు.  “మనం చేస్తున్న యుద్ధం కేవలం చంద్రబాబుతోకాదు. మనం యుద్ధంచేస్తున్నది ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి ఉన్మాదులతో యుద్దంచేస్తున్నాం. అందరూ కలిసి ఒక్కటై ఉన్నారు. ఇంతమందితో కలిసి యుద్ధం చేస్తున్నాం. ఒక అబద్ధాన్ని నిజంచేసేందుకు ఇష్టమొచ్చినట్టుగా వక్రీకరిస్తారు. నానా ప్రయత్నాలు చేస్తారు. ఇన్ని మీడియా ఛానెల్స్‌ వీళ్ల దగ్గరే ఉన్నారు కాబట్టి గోబెల్స్‌ ప్రచారంతో బుల్డోజ్‌ చేస్తారు.“ అని చెప్పారు.

గ్రామంలో 10 మంది కార్య‌క‌ర్త‌ల‌తో ప్ర‌చారం

 ప్రతి గ్రామంలో 10 మంది కార్యకర్తలను యాక్టివ్ చేసి.. అస‌త్య ప్ర‌చారాల‌ను తిప్పికొట్టాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించారు.  తప్పుడు వార్తలు.. చంద్రబాబునాయుడుకి అనుకూలంగా అటువైపు వార్తలు వస్తే…  ఏది నిజమో దాన్ని కౌంటర్‌ చేస్తూ ఇటువైపు నుంచి కూడా ఆధారాలు, సాక్ష్యాలతో రావాలి. అది కూడా గ్రామస్ధాయిలో అందుబాటులోకి తీసుకుని రావాలి. అలా వస్తేనే మన వాళ్లు కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతారు. తప్పుడు ప్రచారాలను కౌంటర్‌ చేసే ఆయుధాలను కార్యకర్తల చేతిలో పెట్టాలి. వీరికి డైనమిక్‌ ట్రైనింగ్‌ ఉండాలి. రాబోయే రోజుల్లో మరింతగా బురదజల్లే కార్యక్రమాలను చేపడతారు.“ అని చెప్పారు.

మారీచుల‌తో యుద్ధం చేస్తున్నాం..

రాష్ట్రంలో కొన్ని వ్య‌వ‌స్థ‌లు  దిగజారిపోయాయ‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. గతంలో నిప్పులేనిదే పొగరాదు అనేవారు. ఇప్పుడు నిప్పు లేకుండానే పొగ తీసుకు వస్తారు అని వ్యాఖ్యానించారు. ఏమీ లేకపోయినా.. ఏదో జరగుతుందనే భ్రమ కల్పిస్తారని అన్నారు. “అసత్య ప్రచారాలతో, గోబెల్స్‌ ప్రచారాలతో మనం యుద్ధంచేయాల్సి వస్తోంది. కాబట్టి మన కార్యకర్తలకు మన వెర్షన్‌ బలంగా తెలుసుండాలి. అదే మన బలం. వారిని ఆ దిశగా చైతన్యం చేయాలి. అది జరగాలంటే మీరు వారితో పూర్తిగా మమేకం కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. గ్రామంలోని 10 మంది కార్యకర్తలను ఇందులో భాగస్వామ్యం చేయాలి. మనం మారీచులతో యుద్ధం చేస్తున్నాం. మామూలుగా మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తారు, ఆ మేరకు జాగ్రత్తగా ఉండాలి“ అని జ‌గ‌న్ స్ప‌ష్టం చేశారు.