ఉత్త‌మ్ సీటు ఊడ‌బీకేందుకు కాంగ్రెస్ నేత‌ల‌ చివ‌రి ప్ర‌య‌త్నం?

తెలంగాణ కాంగ్రెస్‌లో ఇంటి పంచాయ‌తీ మ‌ళ్లీ తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏకంగా ప్ర‌త్యేక స‌మావేశాలు ఏర్పాటు చేసుకోవ‌డం, ఢిల్లీ పెద్ద‌ల‌కు ఫిర్యాదుల వ‌ర‌కూ…సీన్ చేరిపోయింది. ప్ర‌ధానంగా ఇదంతా పీసీసీ ప్రెసిడెంట్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి టార్గెట్‌గా జ‌రుగుతుండ‌టంతో కాంగ్రెస్ ప‌రిణామాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హెచ్ నివాసంలో పలువురు కాంగ్రెస్ నేతల ప్రత్యేక సమావేశం జ‌ర‌గ‌డం, అనంత‌ర ప‌రిణామాలు ఈ ప్ర‌స్తావ‌న‌ను తెర‌మీద‌కు తెస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డితో పాటుగా ప‌లువురు ముఖ్య‌నేత‌లు వీహెచ్ ఇంట్లో స‌మావేశం అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే పోడేం వీరయ్య, నాయిని రాజేందర్ రెడ్డిలు పార్టీని వీడుతారని జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో భేటికి ప్రాధాన్యత ద‌క్కింది.

వీహెచ్ నివాసం నుండే భద్రాచలం ఎమ్మెల్యే పోడెం వీరయ్యతో నేతలు పోన్లో మాట్లాడారు. దీంతోపాటుగా మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్య‌క్షుడు పొన్నాల లక్ష్మయ్యతోనూ తాజా పరిస్థితులపై వీ.హెచ్, దామోదర రాజనర్సింహ పోన్లో సంప్రదించారు. కోర్ కమిటి సమావేశంలో అన్ని చర్చిద్దామ‌ని, అప్పటి వరకు ఓపికతో ఉండాలని పోడెం వీరయ్యకు,నాయిని రాజేందర్ రెడ్డి లకు నచ్చచెప్పారు.

ఈ సంద‌ర్భంగానే ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఆర్సీ కుంతియా, బోసురాజు, సలీంలకు రాష్ట్రంలో పీసీసీ చీప్ ఉత్తమ్ అనుసరిస్తున్న వ్యవహరంపై వీహెచ్ ఫిర్యాదు చేశారు. కొంత మంది నాయకుల వ్యవహరం బాగోలేకనే నేతలు పార్టీని వీడుతున్నారని వీహెచ్ ఆరోపించారు.

మొదటి నుండి కష్టపడుతున్న వారిని పట్టించుకోకుండా కొంతమంది రాష్ట్ర ముఖ్య నేతలు వ్యవహరిస్తున్నారని మండిప‌డ్డారు. వెంటనే కోర్ కమిటిని పిలువాలని, లేదంటే పరిస్దితులు చేయి దాటే ప్రమాదం ఉందని అధిష్టానానికి నేతలు తేల్చి చెప్పారు. దీంతో పీసీసీ చీఫ్‌గా ఉత్త‌మ్‌ను దింపేందుకు చివ‌రి ప్ర‌య‌త్నంగా ఈ చీలిక వ‌ర్గం స‌మావేశం జ‌రిగిందా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.