AP కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు..11న బడ్జెట్

సీఎం జగన్ అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం జరిగింది.ఈ నెల 3న‌నే జరగాల్సి ఉన్న ఈ కేబినెట్ భేటీ దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి పెద్ద క‌ర్మ నేపథ్యంలో నేటికి వాయిదా పడింది. తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో 35 అంశాల‌తో కూడిన అజెండాపై మంత్రులతో జగన్ చర్చ జరిపారు. ఇక, ఈ నెల 25 వరకు మొత్తం 13 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరపాలని, 11న రాష్ట్ర వార్షిక బ‌డ్జెట్‌ ప్ర‌వేశ‌పెట్టాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు.

బీఏసీ సమావేశం అనంతరం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలను పరిశీలించి….కీల‌క చ‌ట్టాల‌కు స‌వ‌ర‌ణ‌లు చేశారు. విదేశీ మ‌ద్యం నియంత్ర‌ణ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయడంతోపాటు టీటీడీ బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితుల నియామ‌కం కోసం హిందూ ధార్మిక సంస్థ‌ల చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయాలని నిర్ణయించింది.

టీటీడీ బోర్డులో ప్ర‌త్యేక ఆహ్వానితులలో కొంతమంది నేర చ‌రితులున్నారన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏకంగా హిందూ ధార్మిక సంస్థ‌ల చ‌ట్టానికే స‌వ‌ర‌ణ చేయాల‌ని నిర్ణయించడం విశేషం. ఇక, ఏపీలో రెండో భాష‌గా ఉర్దూ భాష‌ను గుర్తించేందుకుగాను ఏపీ అధికార భాషా చ‌ట్టం 1966కు స‌వ‌ర‌ణ చేయాల‌ని నిర్ణయించింది.

నిజాంప‌ట్నం, మ‌చిలీప‌ట్నం, ఉప్పాల ఫిషింగ్ హార్బ‌ర్ల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. మ‌చిలీప‌ట్నం, భావ‌న‌పాడు, రామాయ‌ప‌ట్నం పోర్టుల నిర్మాణానికి రూ.8,741కోట్ల రుణ స‌మీక‌ర‌ణ‌ చేయాలని, అందుకోసం ఏపీ మారిటైం బోర్డుకు హామీ ఇచ్చేందుకూ కేబినెట్ అంగీక‌రించింది. మ‌డ‌క‌శిర బ్రాంచ్ కెనాల్ ప‌నుల‌కు రూ.214 కోట్లను కేబినెట్ కేటాయించింది.