మంత్రులందరిది ఒకేమాటా?

రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుకు పూర్తి విరుద్ధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని, మూడు రాజధానుల ఏర్పాటు కుదరదని, అసలు మూడు రాజధానుల ఏర్పాటు అధికారమే రాష్ట్రప్రభుత్వం, అసెంబ్లీకి లేనేలేదని తేల్చి చెప్పేసింది. హైకోర్టు తీర్పు విషయంలో చాలామందికి తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయం తెలిసిందే. సరే తీర్పును పక్కనపెట్టేస్తే మంత్రులందరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.

తీర్పుకు మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులే అని పదే పదే చెబుతున్నారు. తీర్పు రూపంలో కోర్టు ఇంత స్పష్టంగా చెప్పినా మంత్రులు మాత్రమే తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడుందని చెబుతున్నారు. బొత్సా సత్యనారాయణ, బాలినేని  శ్రీనివాసులరెడ్డి, మేకతోటి సుచరిత స్పష్టంగా ప్రకటించారు. మంత్రుల ప్రకటనలు చూస్తుంటే హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా మాట్లాడుతున్నట్లే ఉంది.

మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రితో మాట్లాడకుండా స్వతంత్రంగా మాట్లాడే అవకాశాలు దాదాపు ఉండవని అర్ధమవుతోంది. పైగా హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తామని కూడా చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనకబడిపోతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు హేతుబద్దంగా లేదని అందరికీ అనిపిస్తునే ఉంది.

మూడు నెలల్లో రైతుల ప్లాట్లను డెవలప్ చేయటం సాధ్యంకాదు. అలాగే ఆరుమాసాల్లో అమరావతి నగరాన్ని నిర్మించటం ఎవరివల్లా కాదని అందరికీ తెలిసిందే. మనం డబల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టుకోవాలంటేనే కనీసం ఏడాది పడుతుంది. అలాంటిది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆరుమాసాల్లో నవనగరాలను నిర్మించటం సాధ్యంకాదు. ఇలాంటి అనేక అంశాలపై సుప్రింకోర్టు స్టే ఇవ్వటమో లేకపోతే సవరించటమో జరుగుతుందని అధికారపార్టీ నేతలు ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఏమి చేస్తుందనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది.