దేశాన్ని లైన్ లో పెడ‌తా.. త‌గ్గేదేలే: కేసీఆర్

దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని, దేశాన్ని లైన్‌లో పెడ‌తాన‌ని.. ఈ విష‌యంలో ఇక వెన‌క్కి త‌గ్గేదేలేద‌ని తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రాంచీలో.. ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌తో కలిసి కేసీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించారు. హేమంత్‌ సోరేన్‌తో జాతీయ రాజకీయాలపై చర్చించామని కేసీఆర్‌ వెల్లడించారు. స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గడుస్తున్నా సరైన అభివృద్ధి జరగలేదన్న సీఎం.. దేశంలో మరింత మెరుగైన అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.

దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచిస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు. దేశంలో ప్రత్యామ్నాయంపై త్వరలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. త‌మది ఏ కూట‌మో కూడా త్వ‌ర‌లోనే చెబుతామ‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎవ‌రు ఎన్ని అనుకున్నా.. ఎవ‌రు ఎంత మంది త‌మ‌ను నిల‌దీసినా.. త‌మ దారి ర‌హ‌దారేన‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొంద‌రు కుచ్చిత స్వ‌భావంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. మోడీపై ప‌రోక్షంగా విరుచుకుప‌డ్డారు.

‘దేశాన్ని సరైన దిశలో నడిపించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చర్చలు జరుగుతున్నాయి. ఇది బీజేపీ, కాంగ్రెస్‌ వ్యతిరేక కూటమి కాదు. ఇప్పటివరకు ఏ కూటమి ఏర్పడలేదు. ఏం జరగబోతుందో కాలం నిర్ణయిస్తుంది. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా తర్వాత ఎంత అభివృద్ధి జరగాలో అంత జరగలేదు. దేశం మెరుగైన అభివృద్ధి సాధించాలని కోరుతున్నా. దేశాభివృద్ధి కోసం ఏ మార్గాన్ని అనుసరించాలనే దానిపై ఆలోచనలు కొనసాగుతున్నాయి. అందులో మీ పాత్ర కూడా అవసరం.“ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ పర్యటన ముగించుకొని.. సీఎం కేసీఆర్ నేరుగా ఝార్ఖండ్‌ రాజధాని రాంచీకి  చేరుకున్నారు. తొలుత గిరిజన ఉదయ నేత బిర్సా ముండా విగ్రహానికి కేసీఆర్‌ నివాళులు అర్పించారు. అనంతరం రాంచీలోని ఝార్ఖండ్ సీఎం అధికారిక నివాసానికి వెళ్లారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత బృందాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. శిబు సొరేన్కు  ముఖ్యమంత్రి కేసీఆర్ జ్ఞాపికను అందజేశారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఝార్ఘండ్ సీఎం హేమంత్ సొరేన్తో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు.

ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌తో సమావేశం అనంతరం గల్వాన్ ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్ల కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ సాయం అందించారు. ఝార్ఖండ్కు చెందిన ఇద్దరు అమర జవాన్ల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున చెక్కులను అందించారు. అమర జవాన్‌ కుందన్‌కుమార్‌ ఓజా భార్య నమ్రతకు 10 లక్షల చెక్‌ను హేమంత్‌ సోరేన్‌తో కలిసి అందజేశారు. మరో వీర సైనికుడు గణేష్ కుటుంబసభ్యులకు 10లక్షల చెక్‌ను అందించారు.