అన్ని వేళ్లూ త‌న‌వైపే.. అయినా అవినాష్ మౌన‌మేల‌?

వైఎస్ వివేకానంద హ‌త్య కేసు ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. సీబీఐకి కొంత‌మంది ఇచ్చిన వాంగ్మూలాలు వెలుగులోకి రావ‌డంతో అనూహ్య‌మైన విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ వెల్ల‌డైన వాంగ్మూలాల వివ‌రాల ప్ర‌కారం అన్ని వేళ్లూ క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డివైపే చూపిస్తున్నాయ‌నే అభిప్రాయాలు వ్యక్త‌మ‌వుతున్నాయి. వివేకాను ఆయ‌నే హ‌త్య చేయించార‌నే అభిప్రాయాలు క‌లిగేలా ఈ వాంగ్మూలాలు ఉన్నాయి. త‌న మెడ‌కు ఉచ్చు బిగుస్తుంద‌ని తెలిసి కూడా అవినాష్ ఎందుకు సైలెంట్‌గా ఉన్నార‌న్న‌ది ఇప్పుడు అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది.

తాజాగా అవినాష్ పెదనాన్న వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం సంచ‌ల‌నంగా మారింది. ర‌క్త‌పు మ‌డుగులో వివేకాను చూసి త‌న‌కు అనుమానం వ‌చ్చింద‌ని కానీ అవినాష్ రెడ్డితో పాటు ఇత‌రులు ఆయ‌న గుండెపోటుతో చ‌నిపోయార‌ని చెప్పార‌ని ప్ర‌తాప్ అందులో పేర్కొన్నారు. క‌డ‌ప ఎంపీ సీటు విష‌యంలోనే అవినాష్ కుటుంబానికి, వివేకాకు మ‌ధ్య త‌గాదా పెరిగింద‌నే అర్థం వ‌చ్చేలా ఆయ‌న మ‌ట్లాడారు. అంత‌కుముందు డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి, సీఐ శంక‌ర‌య్య‌, తాజాగా వైఎస్ ప్ర‌తాప్‌రెడ్డి, వివేకా ఇంట్లో ప‌నిమ‌నిషిగా చేసిన ల‌క్ష్మీదేవి.. ఇలా అంద‌రి వాంగ్మూలాలను ప‌రిశీలిస్తే అవినాష్ పేరే ప్ర‌ముఖంగా క‌నిపిస్తోంది. వివేకా గుండెపోటుతో చ‌నిపోయార‌ని ప్ర‌చారం ప్రారంభించింది అవినాష్ రెడ్డే అని ప‌నిమనిషి చెప్పింది.

ఇలా బ‌య‌ట‌కు వ‌స్తున్న సీబీఐ వాంగ్మూలాలు, అందుకు సంబంధించి వ‌స్తున్న ప‌త్రిక‌ల క‌థ‌నాలు అవినాషే హ‌త్య చేయించార‌నేలా ఉన్నాయి. కానీ ఈ విష‌యంలో అవినాష్ మాత్రం మౌనం పాటిస్తున్నారు. కోర్టు విచార‌ణ పూర్త‌యిన త‌ర్వాత నేర‌స్తుడెవ‌రో తెలుస్తుంది. కానీ అంత‌వ‌ర‌కూ త‌న మీద వ‌స్తున్న వ్య‌తిరేక ప్ర‌చారాన్ని క‌ట్ట‌డి చేసేందుకు కూడా అవినాష్ సిద్ధ‌మ‌వ‌డం లేద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విచార‌ణ కోసం త‌న అనుచ‌రులు కోర్టుకు వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డికెళ్లి నానా యాగీ చేయ‌డం, సీబీఐ అధికారుల మీద రంకెలు వేయ‌డంతో వార్త‌ల్లోకి వ‌చ్చిన అవినాష్‌.. ఇప్పుడు నోరు విప్ప‌డం లేదు.

సీబీఐ నుంచి అధికారిక స‌మాచారం లేకుండా ఇలా బ‌య‌ట‌కు వ‌స్తున్న వాంగ్మూలాల వ‌ల్ల త‌న ప‌రువుకు నష్టం క‌లుగుతుంద‌ని అనినాష్ కోర్టును ఆశ్రయించ‌వ‌చ్చు. కానీ ఆయ‌న ఏం చేయ‌డం లేదు. కానీ ఈ విష‌యంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగానే మౌనంగా ఉన్నార‌ని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్పుడు ఏ మాత్రం గొడ‌వ చేసినా త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు బ‌లం చేకూర్చిన‌ట్లు అవుతుంద‌ని ఆయ‌న సైలెంట్‌గా ఉంటున్నార‌ని అంటున్నారు. ఎలాగో సీబీఐ విచార‌ణ త‌ర్వాత తీర్పు వ‌స్తుంది. అప్ప‌టివ‌ర‌కూ మౌనంగా ఉండ‌డ‌మే మేల‌ని అవినాష్ భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.