మ‌ళ్లీ రెచ్చిపోయిన‌ ర‌ఘురామ‌కృష్ణంరాజు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగుర‌వేసిన ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు.. మ‌రోసారి ఫైర్ బ్రాండ్ వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఇటీవ‌లే ఒక వీడియో పెట్టి జ‌గ‌న్, వైకాపా మీద తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న‌.. మ‌రోసారి ఆ పార్టీపై విరుచుకుప‌డ్డారు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వైకాపా ఎమ్మెల్యేల‌కు ఆయ‌న గ‌ట్టిగా బ‌దులిచ్చారు. ఈ సంద‌ర్భంగా ‘‘సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయన్న చందంగా అసెంబ్లీ లాబీలో నాపై పడ్డారు’’ అంటూ ఆయ‌న ర‌జ‌నీకాంత్ డైలాగ్ పేల్చ‌డం విశేషం.

‘‘ఎవరండీ వీళ్లు, ఆఫ్ట్రాల్ గాళ్లు.. ఈ జోకర్లు ఎప్పుడైనా నా గురించి జగన్‌కు చెప్పారా? జగన్‌ను అడగండి. ఆయన అబద్దం చెప్పరు. వాళ్లంతా దొంగలు, ప్రజల నుంచి డబ్బులు, చెక్కులు వసూలు చేశారు. ఎన్నిసార్లు నా కొంప చుట్టూ తిరిగారో, దేనికి తిరిగారో కొట్టు సత్యనారాయణకు తెలీదా. ఆ దొంగ సంగతి ఆయన మేనల్లుడిని అడిగితే చెబుతాడు. ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల పట్టాలకు సంబంధించి 70 శాతం ఫిర్యాదులు తణుకు ఎమ్మెల్యే కారుమూరిపైనే వచ్చాయి. వీళ్ళంతా దొంగలు, ప్రజల నుంచి క్యాష్, చెక్కులు కలెక్ట్ చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సౌమ్యుడు, నిజాయితీ పరుడు.. జగన్ అపాయింట్ మెంట్ దొరకడంలేదని బాధ పడేవారు.’’ అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వైసీపీలోకి వస్తానని తాను బతిమాలడం ఏంటని ప్ర‌శ్నించిన‌ రఘురామకృష్ణంరాజు.. గత ఏడాది రిషీ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్ కిశోర్ తనను కలిశారని, పార్టీలో చేరాలని తనకు ఎన్నో ప్రలోభాలు పెట్టారని వెల్లడించారు. తనను ఏ విధంగా ప్రలోభాలకు గురిచేశారో అక్కడే ఉన్న విజయసాయిరెడ్డిని, రాజిరెడ్డిలను అడగాలన్నారు. తాను ఇప్పటి వరకు జగన్ ఇంటికే వెళ్లలేదని, ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి మాత్రమే ఆయన్ను కలిశానని చెప్పారు.