పుట్టిన‌రోజు కూడా కేసీఆర్ విష‌యంలో… ష‌ర్మిల అదే మాట‌

Sharmila

క్షేత్ర‌స్థాయిలో పార్టీ బ‌లంగా లేన‌ప్ప‌టికీ ఆన్‌లైన్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పై దూకుడుగా స్పందించే వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మరోమారు గులాబీ ద‌ళ‌ప‌తి పుట్టినరోజు సంద‌ర్భంగా ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో ఆమె వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రోజుకో రైతు చస్తున్నా, వారానికో నిరుద్యోగి తల్లికి గర్భశోకం మిగిలిస్తున్నా, పంటనష్టపోయి అప్పుల పాలవుతున్నా, జనాలు అరిగోసల పాలవుతున్నా… దొరగారూ పుట్టిన రోజు వేడుకలు చేసుకోండి అని షర్మిల విమర్శించారు.

నిరుద్యోగుల విష‌యంలో త‌ర‌చుగా స్పందించే వైఎస్ ష‌ర్మిల మ‌రోమారు వారి విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ రోజుల తరబడి సంబరాలు చేసుకోవాలె.. ఎవడెట్లపోయినా ఆయన మాత్రం సల్లంగుండాలె అని దుయ్యబట్టారు. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులను, ఉద్యోగాల కోసం చస్తున్న నిరుద్యోగులను పట్టించుకోకుండా జన్మదిన సెలబ్రేషన్స్ చేసుకోండి అని కామెంట్ చేశారు.

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకొంటూ, అంబేడ్కర్ రాజ్యాంగం గడీల పాలనకు అడ్డొస్తుందని కొత్త రాజ్యాంగం రాయాలనుకునే దొర గారూ పుట్టినరోజు వేడుకలు చేసుకోండి అని షర్మిల ట్వీట్ చేశారు. ఇదిలా ఉండ‌గా, ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్వి అన్నీ తప్పుడు హామీలు అని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆరోపించింది.

కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని.. ఖాళీలు ఉన్నా కావాలనే భర్తీ చేయడం లేదని మండిపడింది. ఎన్నికల కోసం దొర నిరుద్యోగులను ఎరగా వాడుకుంటున్నారని దుయ్యబట్టింది. బిస్వాల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని.. కానీ కేసీఆర్ ప్రభుత్వం భర్తీ చేసింది కేవలం 39 వేలు మాత్రమేనని వైఎస్సార్ టీపీ ట్వీట్ చేసింది. ఉగ్యోగాల భర్తీ కోసం టీఎస్పీఎస్సీని ప్రభుత్వం ఇప్పటివరకు సంప్రదించలేదని విమర్శించింది.