ఏపీ డీజీపీపై వేటు

ఏపీ డీజీపీ మార్పు జ‌రిగిపోయింది. రాష్ట్రంలో ఉద్యోగుల నిర‌స‌న‌ల నేప‌థ్యంలో విజయ‌వాడ‌లో నిర్వ‌హించిన చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన స‌ర్కారు.. ఈ క్ర‌మంలో డీజీపీ గౌతం స‌వాంగ్ ను ప‌క్క‌న పెడుతుందంటూ.. ఈ నెల 4వ తేదీనే గుల్టే ప్ర‌త్యేక క‌థ‌నం ప్ర‌చురించింది. ఏపీ ప్ర‌భుత్వం అనుకున్న విధంగా ఉద్యోగులు ఉద్య‌మాన్ని కంట్రోల్ చేయ‌డంలో డీజీపీ స‌వాంగ్ విఫ‌లం చెందార‌ని.. దీనిపై సీఎం కూడా హుటాహుటిన డీజీపీని పిలిపించుకుని.. మాట్లాడడం వెనుక‌.. ఖ‌చ్చితంగా చ‌ర్య‌లు ఉన్నాయ‌ని.. ‘గుల్టే’ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది.

ఈ క్ర‌మంలో తాజాగా.. ఏపీ ప్ర‌భుత్వం డీజీపీ గౌతం స‌వాంగ్‌ను ప‌క్క‌న పెట్ట‌డంతోపాటు.. ఆయ‌న‌కు ఎలాంటి ప‌ద‌వి ఇవ్వ‌కుండా ఘోరంగా అవ‌మానించ‌డం విస్మ‌యానికి గురిచేస్తోంది. డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌పై బదిలీ వేటు పడింది. జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని గౌతమ్‌ సవాంగ్‌కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డికి డీజీపీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. (యూపీఎస్సీ, కేంద్ర‌హోంశాఖ అనుమ‌తిస్తే.. పూర్తిడీజీపీ అవుతారు)

మ‌రోవైపు ప్రభుత్వం ప‌క్క‌న పెట్టిన గౌతమ్‌ సవాంగ్‌కి ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదు. 1992 బ్యాచ్‌కి చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి 2026 ఏప్రిల్‌ 30 వరకు విధుల్లో ఉండే అవకాశముంది. ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ముగ్గురి పేర్లతో.. కేంద్రానికి ప్రతిపాదనలు పంపనుంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే ఏపీ ప్రభుత్వం డీజీపీగా కసిరెడ్డికి పూర్తి బాధ్యతలు అప్పగించనుంది. అయితే.. గౌతం స‌వాంగ్‌ను సీఎం అన్న అన్న అన‌డం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు, డీజీపీ సేవ చేస్తున్నారంటూ.. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు ఎదుర్కొనాల్సి వ‌చ్చింది.

అంతేకాదు.. ప్ర‌బుత్వం తీసుకున్న నిర్ణ‌యాల్లో పోలీసులు ఇరుకున ప‌డిన‌ప్పుడు.. అనేక సార్లు కోట్టు మెట్లు ఎక్కిన డీజీపీగా గౌతం స‌వాంగ్ పేరు బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉద్యోగుల ‘చలో విజయవాడ’ పరిణామాల దృష్ట్యా.. ముఖ్యమంత్రి జగన్‌.. డీజీపీ సవాంగ్‌ను స్వ‌యంగా త‌న కార్యాల‌యానికి పిలిపించుకుని భేటీ అవ‌డం.. అప్ప‌ట్లోనే డీజీపీకి ఉద్వాస‌న ప‌లుకుతార‌నే వ్యాఖ్య‌లు వినిపించ‌డం గ‌మ‌నార్హం.

సుమారు అర గంట పాటు జరిగిన భేటీలో సీఎం స్వ‌యంగా డీజీపీకి క్లాస్ పీకార‌ని కూడా తెలిసింది. పోలీసులు భారీ సంఖ్య‌లో మోహ‌రించినా.. ఆంక్షలు పెట్టినా ఉద్యోగుల పోరాటం విజయవంతం కావడంపై డీజీపీని సీఎం నిల‌దీసిన‌ట్టు తెలిసింది. ఉద్యోగులకు పోలీసులు సహకరించారన్న విషయంపై మ‌రింత సీరియ‌స్ అయ్యార‌ని, దీనిపై వ‌చ్చిన వార్త‌ల‌ను స్వ‌యంగా సీఎం.. డీజీపీకి చూపించి మ‌రీ చ‌ర్చించార‌ని అప్ప‌ట్లోనే గుల్టే వెల్ల‌డించింది. ఇప్పుడు కేవ‌లం ప‌ది రోజుల్లోనే డీజీపీకి ఉద్వాస‌న ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం.