జ‌గ‌న్ స‌మాధానం చెప్ప‌లేని కామెంట్ చేసిన చంద్ర‌బాబు

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై ప్ర‌తిపక్ష నేత‌, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని ప‌రిణామాలు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యం గురించి స్పందిస్తూ సీఎం జ‌గ‌న్ రిప్లై ఇవ్లేని కామెంట్లు చేశారు.

కృష్ణా నది ఒడ్డున ఉన్న బెర్మ్‌ పార్క్‌ పేరు చెప్పి 143 కోట్ల రూపాయల అప్పు తెచ్చేందుకు ఏపీ ప్ర‌భుత్వం ముందుకు సాగ‌డంపై చంద్ర‌బాబు సెటైర్లు వేశారు. దీంతోపాటుగా కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి సీఎం జ‌గ‌న్‌కు ద‌మ్మున్న స‌వాల్ విసిరారు చంద్ర‌బాబు.

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని చంద్ర‌బాబు మండిప‌డ్డారు. 2009 నాటికి ఏపీ అప్పు 3,14,000 వేల కోట్లుగా ఉంటే.. ప్రస్తుతం ఏపీ అప్పు రూ.7లక్షల కోట్లకు చేరిందని అన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తున్నారని మండిప‌డిన చంద్ర‌బాబు చివరకు విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే స్థాయికి వచ్చారని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టిన ఏపీ ప్రభుత్వ అధికారులు ఇంకొన్నిరోజులు ఆగితే రోడ్లను కూడా తాకట్టు పెడతారని విమర్శించారు. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి జ‌గ‌న్‌ తీసుకువచ్చారని చంద్ర‌బాబు ఆరోపించారు.

కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు గురించి చంద్ర‌బాబు స్పందిస్తూ, పోల‌వ‌రాన్ని 70 శాతం పూర్తి చేశామ‌ని, ఇప్పుడు ఆ ప‌నులే ముందుకు సాగ‌ట్లేదని తెలిపారు. పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా స‌మాధానం చెప్పే ధైర్యం జ‌గ‌న్‌కు లేద‌ని అన్నారు. పోల‌వ‌రంలో అవినీతి జ‌రిగింద‌ని గతంలో జ‌గ‌న్ ఆరోప‌ణ‌లు చేశారని గుర్తు చేసిన చంద్ర‌బాబు ఇప్పుడు అధికారంలో ఉన్న జ‌గ‌న్ ఆ ఆరోప‌ణ‌ల‌ను రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఇక త‌మ పార్టీ నేత , అశోక్‌ బాబు అరెస్టును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏం వ‌చ్చిందంటూ నిలదీశారు.