అడ్రస్ లేని బీజేపీ నేతలు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత బీజేపీ నేతలు ఎక్కడా అడ్రస్ కనబడటం లేదు. మామూలుగా ఏదో విషయంపై ప్రభుత్వంపై ఎగిరెగిరిపడే కమలనాథులు బడ్జెట్ తర్వాత ఎందుకని ఎక్కడా కనబడటంలేదు ? ఎందుకంటే రాష్ట్రప్రయోజనాల విషయంలో బడ్జెట్లో కనీసం ఒక్కటంటే ఒక్క ఊసులేకపోవటమే. పోలవరం ప్రాజెక్టుకు నిధుల ప్రస్తావన లేదు. రెవెన్యూ లోటు భర్తీ గురించి ఏమీ మాట్లాడలేదు. వెనకబడిన జిల్లాల అభివృద్ధి నిధుల ఊసేలేదు.

ఇలా ఏరకంగా తీసుకున్నా రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బకొట్టింది కేంద్రం. జనాలంతా బడ్జెట్ తీరుతో కేంద్రంపై మండిపోతున్నారు. జననాడి గమనించిన తర్వాత కమలనాథులు బడ్జెట్ గురించి మాట్లాడటానికి భయపడినట్లున్నారు. అందుకనే మీడియా ముందుకు రావడానికి మొహం చెల్లలేదు. ఇప్పటికే వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో ఏమి మాట్లాడాలో తెలియని బీజేపీ నేతలు ఒక్కోసారి ఒక్కోరకంగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు.

ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం పాలసీని బహిరంగంగా మద్దతు పలకలేక అలాగని వ్యతిరేకించలేక ఎంత అవస్థలు పడుతున్నారో అర్ధమైపోతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి కారణంగానే జనాలంతా నరేంద్రమోడి సర్కార్ పై మండిపోతున్నారు. ఈ కారణంగానే పంచాయతీ నుండి పార్లమెంటు వరకు జరిగిన ఏ ఎన్నికలో కూడా బీజేపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కటం లేదు.

ఇలాంటి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ 2022-23 ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ పై రాష్ట్రం పెట్టుకున్న ఆశలంతా అడియాశలైపోయింది. ప్రజాగ్రహాన్ని గమనించిన కారణంగానే కమలనాథులు బడ్జెట్ పై స్పందించటానికి వెనకాడుతున్నారు. ఇపుడే కాదు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనల విషయంలో ఇలాగే జరుగుతోంది. బహుశా రాష్ట్రానికి ఏమి చేసినా చేయకపోయినా రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదని నిర్ధారణకు వచ్చినట్లున్నారు కేంద్రంలోని పెద్దలు. అందుకనే రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం తుంగలో తొక్కేస్తున్నారు.