బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా: కేసీఆర్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ముఖ్యమంత్రి కేసీఆర్… తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆత్మవంచన చేసుకుని… దేశ ప్రజలను వంచించారన్నారు. బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం అని దుయ్యబట్టారు. కేంద్ర బడ్జెట్‌పై  తీవ్ర‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. దిశ, దశ, నిర్దేశం లేని పనికిమాలిన.. పసలేని బడ్జెట్‌ అని విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్‌లో మాటల గారడీ తప్ప ఏమీ లేదని, ఇది చాలా దారుణమైన బడ్జెట్‌ అని మండిపడ్డారు. సామాన్యులను నిరాశ, నిస్పృహకు గురిచేసిందన్నారు. దేశ ప్రజల్ని ఘోరంగా అవమనించారని, బడ్జెట్‌లో పేదలకు గుండుసున్నా అని విమర్శించారు.

మసిపూసి మారేడుకాయ చేసిన గోల్‌మాల్‌ బడ్జెట్‌ అని ఎద్దేవా చేశారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యమని, దేశ చేనేత రంగానికి బడ్జెట్‌లో చేసిందేం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా దారుణంగా ఉందని సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్… మహాభారతంలోని శ్లోకాలు ప్రస్తావించారన్న సీఎం… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా పాలించాలో శ్లోకం చెబుతుందని తెలిపారు. న్యాయ మార్గంలో పరిపాలన సాగాలని శ్లోకాల్లో ఉందని చెప్పారు. ఆర్థికమంత్రి చెప్పింది శాంతి మార్గం.. చేసింది అధర్మమని ఆరోపించారు.

బడ్జెట్‌లో అందరికీ గుండు సున్నా… బడ్జెట్‌ అంతా గోల్‌మాల్‌ గోవిందం అని దుయ్యబట్టారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఆత్మవంచన చేసుకుని… దేశ ప్రజలను వంచించారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు బడ్జెట్‌లో రూ.12,800 కోట్లే కేటాయించారని సీఎం అన్నారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలోనే రూ.33,600 కోట్లు కేటాయించినట్లు చెప్పుకొచ్చారు. ఎస్సీల జనాభాపై కేంద్రం అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. రైతు ఉద్యమంలో 700 మంది చనిపోయినా బడ్జెట్‌లో కేటాయింపులు శూన్యమని ఆరోపించారు. బడ్జెట్‌లో సాగు రంగానికి ఉద్దీపనలు లేవని సీఎం అన్నారు. రైతులకు ఏమీ చేయకపోగా యూరియాపై రాయితీ తగ్గించారన్న కేసీఆర్… ఎరువులపై రూ.35 వేల కోట్లు రాయితీ తగ్గించారని మండిపడ్డారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ రూ.25 వేల కోట్ల కోత విధించారని తెలిపారు.

రైతుల ఆదాయం రెట్టింపు అని చెప్పి పెట్టుబడి రెట్టింపు చేశారు. అందరికీ ఇళ్ళు అనేది పచ్చి బోగస్. ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షలు అన్నారు. ఏమైంది?. ఆకలి చావులలో మన దేశ స్థానం 101. 65 వేల కోట్ల ఆహార సబ్సిడీ తగ్గించారు. బడ్జెట్‌లో ఎమ్ఎస్‌పీ ప్రస్తావన లేదు. అన్ని రంగాలకు కోతలే..పెంచింది ఎవరికి?. రేకు డబ్బాలలో  రాళ్లు వేసి ఊపినట్లు..మాట్లాడం తప్ప బీజేపీ చేసిందేమి లేదు. సిగ్గులేకుండా ఎల్ఐసీని అమ్ముతున్నామని చెప్తున్నారు. ఎల్ఐసీ అమ్మకానికి కారణాలు చెప్పాలి. అంతర్జాతీయ భీమా కంపెనీలకు బ్రోకర్‌లుగా వ్యవహరిస్తరా.’ అని సీఎం కేసీఆర్‌ కేంద్ర బడ్జెట్‌పై ధ్వజమెత్తారు.